Telangana : ఏ మార్పు కావాలని తెలంగాణ ప్రజలు ప్రజాప్రభుత్వంపై విశ్వాసం ఉంచారో రెండేళ్లలోనే ఆ మార్పు స్పష్టంగా చూపించి ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి అన్ని రంగాలలోనూ మరీ ముఖ్యంగా ఆర్థిక రంగంలో పెను సంక్షోభమని ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో ఒక్కోమెట్టు పేర్చుకుంటూ సంక్షోభం నుంచి గట్టెక్కుతూ అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామని అన్నారు. ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలలో స్పష్టమైన మార్పునకు నాంది పలుకుతున్నాయని అన్నారు.
Read Also: HYD Crime: హుస్సేన్సాగర్లో దూకి యువతి ఆత్మహత్య?
తెలంగాణ దేశానికి ఆదర్శం
వ్యవసాయం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం, సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఉపాధి కల్పన వరకు అన్ని రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలుపుతున్నాయన్నారు. ఈ మార్పులను ప్రజలకు సమర్ధవంతంగా చేరవేయడంలో ప్రజా సంబంధాల శాఖ పాత్ర అత్యంత కీలకం. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకొని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పధకాలను ఎప్పటికప్పుడు వేగవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సమాచార శాఖ అధికారులకు సూచించారు. సోమవారం సచివాలయంలోని తన ఛాంబర్లో ఆధునీకరించిన సమాచార పౌరసంబంధాల శాఖ వెబ్సైట్ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాలనను రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో వసంతంలోకి అడుగుపెట్టాం. రెండేళ్ల కాలం మరీ తక్కువే కానీ ప్రభుత్వం సాధించిన విజయాలు మాత్రం అత్యద్భుతం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టాం. ఎన్నికల్లో హామీలు ఇవ్వకపోయినా ప్రజల సంక్షేమం కోసం పలు పధకాలను అమలు చేశాం అని చెప్పారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నాం. ఆర్ధికవృద్దిలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది.
తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఒకవైపు ప్రపంచ నగరాలతో పోటీ పడే లక్ష్యాలను నిర్దేశించుకొని మరోవైపు పేదల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తూ, ద్విముఖ వ్యూహంతో మా ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను రెండేళ్లలో దేశానికి రోల్మొడల్గా నిలబెట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐ పిఆర్ కమీషనర్ సిహెచ్. ప్రియాంక, ముఖ్యమంత్రి సీపీఆర్వో జి. మల్సూర్, సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ డిఎస్ జగన్, జాయింట్ డైరెక్టర్ రమణ తదితర అధికారులు పాల్గొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: