హైదరాబాద్ మహానగరం చుట్టుపక్కల పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఫాంహౌస్ల నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సమగ్రమైన ‘ఫాంహౌస్ పాలసీ’ని తీసుకురాబోతోంది. ప్రస్తుతం నగర కాలుష్యం, రద్దీ నుండి ఉపశమనం పొందేందుకు వీకెండ్లలో ఫాంహౌస్లకు వెళ్లడం ఒక ట్రెండ్గా మారింది. అయితే, ఇప్పటివరకు ఈ నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన అనుమతులు లేదా విధివిధానాలు లేకపోవడంతో, వ్యవసాయ భూముల్లో అడ్డగోలుగా నిర్మాణాలు సాగుతున్నాయి. ఈ అనిశ్చితిని తొలగించి, ఫాంహౌస్ నిర్మాణాలను క్రమబద్ధీకరించడం ద్వారా అటు అక్రమాలకు అడ్డుకట్ట వేయడం, ఇటు ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చుకోవడం ఈ పాలసీ ప్రధాన లక్ష్యం.
ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త నిబంధనల ప్రకారం, ఫాంహౌస్ నిర్మించాలంటే కనీసం 1,200 చదరపు గజాల స్థలం ఉండటం తప్పనిసరి. కేవలం 100 లేదా 200 గజాల్లో చిన్న చిన్న నిర్మాణాలు చేపట్టి ‘గుంటల’ లెక్కన విక్రయించే అక్రమ రిజిస్ట్రేషన్లకు ఇకపై చెక్ పడనుంది. అలాగే, ప్రతి ఫాంహౌస్కు కనీసం 30 అడుగుల వెడల్పైన రోడ్డు సౌకర్యం ఉండాలి. నిర్మాణ విస్తీర్ణంపై కూడా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది. మొత్తం స్థలంలో కేవలం 20 శాతం మాత్రమే కాంక్రీట్ నిర్మాణానికి (G+1 అంతస్తు వరకు) అనుమతి ఉంటుంది. అంటే 1,200 గజాల స్థలంలో కేవలం 240 గజాల్లో మాత్రమే ఇల్లు కట్టుకోవాలి, మిగిలిన 80 శాతం స్థలాన్ని పండ్ల తోటలు లేదా కూరగాయల సాగు వంటి హరిత ప్రాంతంగానే ఉంచాలి. భవనం ఎత్తు కూడా 6 మీటర్లకు మించకూడదు.
CM Revanth : అలాంటి వారిని పార్టీ నుంచి పంపిస్తే పార్టీకే నష్టం – రేవంత్
ఈ పాలసీ అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేస్తోంది. జోన్ల పరిమితి లేకుండా కమర్షియల్, ఇండస్ట్రియల్ జోన్లలో కూడా నిబంధనలకు లోబడి ఫాంహౌస్లకు అనుమతులు ఇచ్చే ఆలోచనలో సర్కార్ ఉంది. మొయినాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల, మేడ్చల్ వంటి ప్రాంతాల్లో వెలుస్తున్న లేఅవుట్లను ఇకపై కేవలం వ్యవసాయ భూములుగా కాకుండా, ‘ఫాంహౌస్ జోన్లు’గా గుర్తించి అభివృద్ధి ఛార్జీలు, కన్వర్షన్ ఫీజులు వసూలు చేయనున్నారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత పెరగడమే కాకుండా, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com