తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సంక్షేమాన్ని అందించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 1 నుండి రాష్ట్రవ్యాప్తంగా మూడు నెలల (జూన్, జూలై, ఆగస్టు) రేషన్ సరుకులను ముందుగానే పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.

దీని ప్రధాన ఉద్దేశ్యం భారీ వర్షాలు, వరదల ముప్పును దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు మూడు నెలల ముందుస్తు రేషన్ అందించనుంది. జూన్, జూలై, ఆగస్టు మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్. చౌహాన్ శనివారం ఆదేశాలు జారీ చేశారు.
డి.ఎస్. చౌహాన్ ఆదేశాలు జారీ
పౌర సరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్. చౌహాన్ ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్లు, డీటీఎస్లకు పలు ఆదేశాలు జారీ చేశారు. జూన్ 1 నుంచి 30వ తేదీ లోగా ఈ మూడు నెలల రేషన్ పంపిణీని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్లు, డీటీఎస్లకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కమిషనర్ చౌహాన్ పౌరసరఫరాల శాఖ అధికారులకు సూచించారు. ఇప్పటికే మూడు నెలలకు సరిపడా బియ్యం కేటాయింపులు స్టేజ్-1 గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు చేరే ప్రక్రియ దాదాపు పూర్తయిందని ఆయన తెలిపారు.
ఎవరికి ఎంత రేషన్ అందుతుంది?
వివిధ రకాల రేషన్ కార్డు లబ్ధిదారులకు సరుకుల పంపిణీ ఇలా ఉంటుంది.ఆహార భద్రతా కార్డు కలిగిన వారికి ఇంట్లోని ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున ఒకేసారి మూడు నెలల బియ్యం అంటే మొత్తం 18 కిలోలు అందజేస్తారు.
ఏఎఫ్ఎస్సీ కార్డుదారులకు 35 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తారు.
అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల బియ్యం ఉచితంగా లభిస్తుంది.
ఏఏవై (అంత్యోదయ అన్న యోజన) కార్డుదారులకు కిలో పంచదారను రూ. 13.50 చొప్పున ఇస్తారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని వారికి కిలో గోధుమలు రూ. 7 చొప్పున 5 కిలోలు పంపిణీ చేస్తారు.
ఈసారి పోర్టిఫైడ్ సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది, ఇది పోషక విలువలను పెంచడంలో సహాయపడుతుంది.
ఈ-పాస్, బయోమెట్రిక్ విధానం
ఈసారి రేషన్ పంపిణీలో పారదర్శకత పెంచే ఉద్దేశ్యంతో ఈ-పాస్ (e-POS) సాంకేతికతను వినియోగిస్తారు. నెలనెలకు వేర్వేరు ఈపీవోఎస్ రసీదులను జనరేట్ చేయాలని, అలాగే బయోమెట్రిక్ ద్వారా ధ్రువీకరణను కూడా నెలనెలకు వేర్వేరుగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఇది లబ్ధిదారులకు సజావుగా రేషన్ అందేలా చూడటంతో పాటు అక్రమాలను నిరోధిస్తుంది. ఈ ముందస్తు రేషన్ పంపిణీ నిర్ణయం ద్వారా వానకాలంలో పేద ప్రజలకు ఆహార భద్రతను కల్పించటానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
Read also: KTR: మిస్ ఇంగ్లాండ్ మిల్లా ఆరోపణలపై విచారణ చేపట్టాలన్న కేటీఆర్