తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 92.78 శాతం ఉత్తీర్ణత నమోదవ్వడం గమనార్హం. గతేడాది కంటే ఇది 1.47 శాతం అధికం. గురుకుల పాఠశాలలు అత్యధికంగా 98 శాతం ఉత్తీర్ణత నమోదు చేయగా, ఆశ్రమ పాఠశాలలు 95 శాతం, ప్రైవేట్ పాఠశాలలు 94.12 శాతం ఉత్తీర్ణత సాధించాయి.
మహబూబాబాద్ జిల్లా టాప్
ఈ సంవత్సరం టెన్త్ ఫలితాల్లో కొన్ని కీలక మార్పులు చేశారు. గతంలోలా కేవలం గ్రేడ్లు, సీజీపీఏ ఇవ్వకుండా, రాత పరీక్షా మార్కులు, ఇంటర్నల్ మార్కులు, మొత్తం మార్కులు మరియు గ్రేడ్లతో కూడిన పూర్తి మెమోను ఈసారి అందజేయనున్నారు. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల్లో జిల్లా వారీగా చూస్తే, మహబూబాబాద్ జిల్లా అత్యధికంగా 99.29 శాతం ఉత్తీర్ణత సాధించగా, వికారాబాద్ జిల్లా అత్యల్పంగా 73.97 శాతం మాత్రమే సాధించింది.
Read Also : KTR: సింహాచలం ఘటనపై స్పందించిన కేటీఆర్
రెండు ప్రైవేట్ పాఠశాలల్లో ‘0’ ఉత్తీర్ణత
మొత్తం 4,629 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదవడం ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. కానీ ఈ సారి రెండు ప్రైవేట్ పాఠశాలల్లో ఒక్కరూ ఉత్తీర్ణత సాధించకపోవడం గమనార్హం. ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్సైట్లలో చూసుకోవచ్చు. ఈ ఏడాది ఫలితాల విడుదల కార్యక్రమం విద్యార్థులకు ఆనందకరంగా మారింది. విద్యార్థుల కృషిని రాష్ట్ర ప్రభుత్వం అభినందించింది.