తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలు (Anganwadi centers) త్వరలోనే పోషకాహార పంపిణీకి కొత్త ఒరవడిని చూపించబోతున్నాయి. ప్రస్తుతం అందిస్తున్న ఆహార పదార్థాలతో పాటు, జొన్నతో తయారయ్యే పలు ఆరోగ్యకరమైన వంటకాలు – ముఖ్యంగా జొన్న రొట్టె, ఉప్మా, లడ్డూ, చిక్కీ, కిచిడి వంటి అంశాలను కర్ణాటక మోడల్ను అనుసరించి ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది.

సీఎం సమీక్షలో కీలక సూచనలు
తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి తాజాగా నిర్వహించిన సమీక్షలో కర్ణాటక తరహా (Karnataka style) లో ఇక్కడా జొన్నరొట్టె ఇవ్వాలని, దీనిని మహిళా సంఘాలతో తయారు చేయించాలని సూచించారు. దీనిపై అధికారులు దృష్టి సారించారు. ముఖ్యంగా మహిళా సంఘాల ద్వారా ఈ వంటకాలను తయారు చేయించి, కేంద్రాలకు సరఫరా చేయడం ద్వారా స్థానిక ఉపాధికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా బలాన్ని చేకూర్చాలన్న లక్ష్యంతో ఈ చర్యలు చేపడుతున్నారు.
కర్ణాటక మోడల్ అధ్యయనం – అధికారుల బృందం పర్యటన
ఈ మేరకు, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో అనుబంధ పోషకాహార కార్యక్రమం కింద సంవత్సరంలో 300 రోజుల పాటు జొన్నతో ఉప్మా, రొట్టె, లడ్డూలు, చిక్కీలు, కిచిడి తయారు చేసి ఇస్తున్నారు. అక్కడి విధానంపై అధ్యయనానికి త్వరలో తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ, పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారుల బృందాన్ని పంపించనున్నారు. అయితే వారు దీనిపై నివేదిక సమర్పించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.
జొన్న వినియోగం పెరుగుతోంది – రైతులకు శుభవార్త
ఇప్పటికే తెలంగాణలో జొన్నరొట్టెలను మహిళలు, కౌమార బాలికలకు, ఇతర పదార్థాలను పిల్లలకు ఇచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో జొన్న వినియోగం పెరుగుతోంది. అలాగే సాగు వానా కాలంలో 50 వేల ఎకరాలు, యాసంగిలో 4 లక్షల ఎకరాలు ఉంది. ఈ నేపథ్యంలో అంగన్వాడీలకు ఆహార పథకంగా చేపట్టిన కారణంగా సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
చిన్నారులకు ప్రత్యేక ఆకర్షణగా ఎగ్ బిర్యానీ
పిల్లల్ని ఆకర్షించేందుకు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో అంగన్వాడీల పాత్ర కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో చిన్నారులను ఆకట్టుకోవడానికి, వారికి విద్యాబుద్ధులు నేర్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి ‘అమ్మ మాట – అంగన్వాడీ బాట’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గత నెలలో అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఎగ్ బిర్యానీ వడ్డించారు. పిల్లలకు సరైన పోషకాహారం అందించాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
రక్తహీనతను ఎదుర్కొనే దిశగా
తెలంగాణలో పోషకాహార లోపంతో రక్తహీనత కలిగిన మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. దీనివల్ల పుట్టిన పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో పిల్లల ఎదుగుదల, పోషణపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిని అధిగమించడానికి ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా చిన్నారులకు, గర్భిణులకు భోజనంలో గుడ్డు వడ్డించేది. సన్న బియ్యం, మంచి నూనె, గుడ్లు ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. ఇలా చిన్నారులకు పోషకాహారాన్ని అందిస్తూ పసి మనసులను ఆకట్టుకుంటున్నారు. ఇంతకుముందు ప్రతి సోమ, బుధ, గురువారాల్లో గుడ్డుతో కూర చేసేవారు. కానీ ఇప్పుడు బిర్యానీతో మరిన్ని పోషకాలు అందేలా చూస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: High Court: మీకంటూ ఓ పద్ధతి లేదా? హైడ్రాపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు