తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెను సంచలనాన్ని రేపుతూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన బహిష్కరణపై తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ తనను బహిష్కరించడాన్ని తప్పుబట్టారు. ఆయన పార్టీ నుంచి బహిష్కరించినా, తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ,మనం ఏదైనా పని చేస్తే తరతరాలుగా గుర్తుంచుకోవాలని తెలిపారు.
మంత్రివర్గంపై సెటైర్లు
తనను పార్టీ నుంచి తొలగించిన విషయం గురించి మీడియాతో మాట్లాడిన మల్లన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైనా చేస్తే, ఆయన మంత్రివర్గంలోని మంత్రులే మర్చిపోతున్నారని ఎద్దేవా చేశారు.పార్టీ నుండి తనను బహిష్కరించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు.
షోకాజ్ నోటీసులపై ఘాటు వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ తనపై షోకాజ్ నోటీసులు జారీ చేయడం, చివరకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై కూడా మల్లన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఈ చర్యలకు భయపడేది లేదని, ఎవరి ఒత్తిళ్లకూ లొంగబోనని స్పష్టం చేశారు. “వారి పిల్ల గాండ్రింపులకు భయపడే వ్యక్తిని నేను కాదు” అంటూ ఆయన తనదైన తీరు చూపారు.
బీసీ ఉద్యమం
తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించబడ్డా, బీసీ ఉద్యమాన్ని మాత్రం ఆపబోనని మల్లన్న చెప్పారు. కులగణన జరగాలని, తెలిపారు.కులగణన ద్వారా రాహుల్ గాంధీ తలెత్తుకొని తిరగాలని తాను ఆశించానని, కానీ అలా జరగలేదని విమర్శించారు.

తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, కులగణనను నూటికి నూరు శాతం పారదర్శకంగా చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనిలో లోపాల వల్ల అగ్రవర్ణాలను అధిక సంఖ్యలో చూపించి, బీసీలను తగ్గించి చూపించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ విధానం నిజమైన బీసీ హక్కులను అణచివేసేలా ఉందని, ఈ విషయంలో పారదర్శకత లేకపోవడం అన్యాయం అని మండిపడ్డారు.
తగ్గేది లేదని స్పష్టం
తన రాజకీయ ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. బీసీల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటానని, ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తానని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు త్వరలోనే తీర్పు చెప్పబోతున్నారని, నిజమైన ప్రజా నాయకుడు ఎవరో అప్పుడే తేలిపోతుందని అన్నారు.