హైదరాబాద్: తెలంగాణ నీటి పారుదల శాఖ కోసం గత ప్రభుత్వం చేసిన కృషిని మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి గుర్తుచేశారు. బుధవారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘కేసీఆర్ కృషి ఫలితం..సీతారామా ప్రాజెక్టు.నెర్రెలు బాసిన సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు.నాడు సీతారామ ప్రాజెక్టును వ్యతిరేకించిన కాంగ్రెస్. నాడు అనుమతులు రాకుండా కోర్టుల్లో కేసులు. నేడు గోదావరి జలాల వద్ద ఫోటోలకు ఫోజులిస్తున్న కాంగ్రెస్ మంత్రులు,నాయకులు. తిట్టడం తప్ప.. కట్టడం రాని కాంగ్రెస్ కు, కెసిఆర్ గొప్పతనం ఇప్పటికైనా అర్థం కావాలి.
కాంగ్రెస్ చేతగానితనం వల్ల సాగర్ ఆయకట్టుకు కరువు
ఈ ప్రాజెక్టుతో ఒక్క ఎకరాకు నీరు రాదు అన్నోళ్ళు, ఏం సమాధానం చెబుతారు? కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి హక్కులను కాపాడలేని కాంగ్రెస్ చేతగానితనం వల్ల సాగర్ ఆయకట్టుకు కరువు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల రోజుకు పదివేల క్యూసెక్కుల కృష్ణ జలాలను ఆంధ్ర తరలించుకుపోతున్న పరిస్థితి. ఈ తరుణంలో రైతులను ఆదుకునేందుకు ఏకైక మార్గం గోదావరి జలాలను ఒడిసి పట్టి, ఎత్తిపోయడం.దీన్ని ముందే అంచనా వేసిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
అనుమతులు రాకుండా కోర్టుల్లో కేసులు
కేంద్రం కొర్రీలను, కాంగ్రెస్ పార్టీ కుట్రలను ఛేదించి వడివడిగా (90%)శాతం పనులు పూర్తి చేశారు. ఇదే కాంగ్రెస్ నేతలు నాడు సీతారామ ప్రాజెక్టే వృధా అన్నరు. అనుమతులు రాకుండా కోర్టుల్లో కేసులు వేయించారు. కానీ కెసిఆర్ పట్టుబట్టి న్యాయపరమైన చిక్కులు తొలగించి, అత్యంత క్లిష్టమైన అటవీ_పర్యావరణ అనుమతులు సాధించి సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయించారు. ఆ ఫలితమే నేడు కరువు కోరల్లో చిక్కుకున్న ఖమ్మం జిల్లా రైతులకు వరంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి సిద్ధంగా ఉంచిన సీతారామ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తూ అక్కడ ఫోటోలకు మంత్రులు, నాయకులు ఫోజులు ఇస్తున్నారంటే అందుకు కేసిఆర్ ఏ కారణం అన్నారు.