సిరిసిల్ల: తన ఛానల్ వీక్షకులను పెంచుకోవాలని భావించిన ఓ యూట్యూబర్ మాజీ మావోయిస్టుతో సంచలన ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా మావోయిస్టుగా ఉన్న సమయంలో తను చేసిన హత్యలను వివరించాడు. అదే ఆయన కొంప ముంచింది. ఆ ఇంటర్వ్యూ చూసిన ఓ వ్యక్తి తన తండ్రి చావుకు కారణమని భావించి ఆ మాజీ మావోయిస్టును (Maoist) దారుణంగా హత్య చేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read Also: KCR: సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చింది: పీసీసీ చీఫ్
మాజీ మావోయిస్టు నర్సయ్య హత్య
రాజన్న సిరిసిల్ల జిల్లా (Siricilla) తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన మావోయిస్టు మాజీ డిప్యూటీ దళ కమాండర్ బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్ధన్న అలియాస్ బాపురెడ్డి (58) గురువారం సాయంత్రం హత్యకు గురయ్యారు. ఆయనను వేములవాడ శివారులోని అగ్రహారం గుట్టల్లో జగిత్యాల జిల్లాకు చెందిన సంతోష్ అనే యువకుడు హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మావోయిస్టు నేపథ్యం: నాటి పీపుల్స్వార్ పార్టీలో సిద్ధన్నగా పేరుగాంచిన నర్సయ్య పదేళ్ల పాటు నక్సల్స్ ఉద్యమంలో పనిచేశారు. సిద్ధన్న 1997 ప్రాంతంలో పీపుల్స్వార్ పార్టీ (ఇప్పటి మావోయిస్టు)లో పనిచేశారు. కాగా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్లో సిద్ధన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లాకు చెందిన ఫలానా వ్యక్తిని పార్టీ నిర్ణయం మేరకు హత్య చేసినట్లు చెప్పారు.

హత్యకు కారణం, సంతోష్ ప్లాన్
యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూను చూసిన సదరు హత్యకు గురైన వ్యక్తి కొడుకు సంతోష్ సిద్ధన్నపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా సిద్ధన్నను హత్య చేయాలని భావించినట్లు సమాచారం. ఇటీవల సిద్ధన్నతో స్నేహం చేసినట్లు తెలిసింది. “మీరు యూట్యూబ్ ఇంటర్వ్యూలు చాలా బాగా ఇస్తున్నారు. మీరంటే నాకు ఎంతో అభిమానం” అంటూ నమ్మించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సిరిసిల్లకు తరచూ వస్తూ సిద్ధన్నను కలుస్తూ పోయినట్లు సమాచారం. ఇలా ఉండగానే గురువారం వేములవాడ శివారులోని అగ్రహారం గుట్టల్లోకి తీసుకెళ్లిన సంతోష్ సిద్ధన్నపై బండరాళ్లు ఎత్తేసి హత్య చేసినట్లు తెలిసింది. అనంతరం సంతోష్ పోలీసులకు లొంగిపోయి ఈ సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కుటుంబ నేపథ్యం, పోలీసుల దర్యాప్తు
మృతుడు సిద్ధన్నకు ఇద్దరు భార్యలు పోచవ్వ, ఎల్లవ్వ ఉన్నారు. ప్రస్తుతం సిద్ధన్న బీఆర్ఎస్ (BRS) పార్టీలో పనిచేస్తున్నాడని తెలుస్తోంది. సిద్ధన్న హత్యకు గురైనట్లు తెలిసిన కుటుంబ సభ్యులు గండిలచ్చపేట నుంచి బయలుదేరి వేములవాడకు చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, ఎస్సై రామ్మోహన్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గత నేరాలు: కాగా, సిద్ధన్న అప్పటి పీపుల్స్వార్ జిల్లా కార్యదర్శి ఆజాద్ అలియాస్ గాజర్ల సారయ్య ఆదేశాలతో 2003లో తొమ్మిది మంది దళ సభ్యులను హతమార్చిన ఘటనలో కీలకంగా ఉన్నారు. పీపుల్స్వార్ పార్టీలో కోవర్టుకు పాల్పడ్డారని 9 మందిని వారు హత్య చేశారు. కోనరావుపేట మండలం వట్టిమల్ల–మరిమడ్ల శివారుల్లో ఆరుగురిని, మానాల శివారులో ముగ్గురిని పీపుల్స్వార్ నక్సలైట్లు హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న సిద్ధన్న ఈ సంఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని, తొమ్మిది మంది సహచరులను ఏకకాలంలో చంపడం బాధ అనిపించిందని సిద్ధన్న యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్పాడు.
2004లో పోలీసులకు లొంగిపోయిన సిద్ధన్న సొంతూరు గండిలచ్చపేటలో నివాసం ఉంటున్నారు. దశాబ్ద కాలం పాటు పీపుల్స్వార్లో పనిచేసిన సిద్ధన్న చివరికి ఇలా హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. సంతోష్ ఒక్కరే ఈ దారుణానికి ఒడిగట్టారా.. ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: