తెలంగాణ రాష్ట్రంలో చాలా కాలంగా ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటం నేటితో సఫలమైంది. దాదాపు 30 ఏళ్లుగా ఎస్సీ సామాజిక వర్గాలు ఈ వర్గీకరణ కోసం ఆందోళనలు, ర్యాలీలు నిర్వహిస్తూ ప్రభుత్వ దృష్టిని ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో, నేడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేయనుంది. ఇందుకోసం సంబంధిత ఉత్తర్వులు, నిబంధనలు విడుదల చేయనుంది.
ఎస్సీ వర్గీకరణ కార్యరూపం
ఈ నూతన విధానానికి సంబంధించి ఉత్తర్వుల తొలి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించాలన్న నిర్ణయం తీసుకుంది ఎస్సీ వర్గీకరణపై ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం. ఈ ఉపసంఘానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణను కార్యరూపంలోకి తేవడం ద్వారా వివిధ వర్గాలకు న్యాయమైన ప్రతినిధిత్వం కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసినట్లైంది.

దేశవ్యాప్తంగా చర్చకు తెర తీసే అంశం
ఇది కేవలం రాష్ట్రస్థాయిలో ఓ కీలక నిర్ణయంగా మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా చర్చకు తెర తీసే అంశంగా మారింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తరువాత ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందనుంది. ఇది ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలవొచ్చని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సమానత్వానికి, న్యాయానికి ప్రతీకగా ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని అభిప్రాయపడుతున్నారు.