జూదం ఓ వ్యసనమని నిస్సందేహంగా చెప్పొచ్చు. సరదాగా ప్రారంభమయ్యే ఈ వ్యసనం కొన్నాళ్లకే మనిషిని పూర్తిగా కబళిస్తుంది. గతంలో మారుమూల ప్రదేశాల్లో గుట్టుగా జూదం ఆడేవారు. అయితే, సాంకేతికత పెరిగిన నేపథ్యంలో, ఇప్పుడు అది తేలికగా అందుబాటులోకి వచ్చేసింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు అనేక కుటుంబాలను బలి తీసుకుంటున్నాయి. భారతదేశంలో బెట్టింగ్ పై నిషేధం ఉన్నప్పటికీ, మొబైల్ ఫోన్ ద్వారా బెట్టింగ్ యాప్లు విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి.కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ యాప్లు తొలిసారి రిజిస్ట్రేషన్ చేసిన వారికి ప్రలోభాలుగా డబ్బును ఇస్తాయి. మొదట్లో వందకు రెండు వందలు, వెయ్యికి రెండు వేలు ఇవ్వడం ద్వారా వినియోగదారులను తన వలలోకి వేసుకుంటాయి. ఈజీ మనీ కోసం అనేక మంది ఈ ఊబిలో మునిగిపోతున్నారు. యువత మాత్రమే కాకుండా, ఉద్యోగులు, పోలీసులు, వ్యాపారులు కూడా వీటి బారిన పడుతున్నారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రమోషన్
ఐపీఎస్ అధికారి సజ్జనార్ తనదైన శైలిలో సైబర్ నేరాలపై పరిష్కారం చూపుతున్నారు. అమాయక యువకులను లక్ష్యంగా చేసుకుని బెట్టింగ్ యాప్ ల వైపు మళ్లించే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు సజ్జనార్ సూచిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక పోలీసులు బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకు తగిన బుద్ధి చెబుతున్నారు.హోలీ పండుగ వేళ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకు సీనియర్ ఐపీఎస్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారికి రంగు పడుద్దని తన ట్వీట్ ద్వారా హెచ్చరించారు.
అలాగే యువతను సజ్జనార్ ప్రశ్నిస్తూ,మీలో ఎంత మంది బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్లను గుర్తించారని వారిలో ఎంతమందిని బ్లాక్ చేశారని యూజర్లను తన ట్వీట్ లో ప్రశ్నించారు. అలాగే ఈ విషయాన్ని మీ స్నేహితులకు ట్యాగ్ చేయండి అంటూ సజ్జనార్ సూచించారు. ఎవరైనా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని యువతను కోరారు.
కేసు నమోదు
ఇటీవల బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్లపై కేసులు కూడా నమోదయ్యాయి.ఇటీవల వైజాగ్ పోలీసులు లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సూర్యాపేట జిల్లాకు చెందిన భయ్యా సన్నీ యాదవ్ పై కూడా కేసు నమోదైంది. పోలీసులు బెట్టింగ్ యాప్ లపై సీరియస్ గా వ్యవహరిస్తుండడంతో రాష్ట్రంలోని ఇన్ఫ్లయెన్సర్లు తమ సోషల్ మీడియా ఖాతాలలోని బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వీడియోలను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.