ఆర్టీసీ సమ్మె తాత్కాలికంగా వాయిదా: మంత్రి పొన్నంతో చర్చలు సఫలం
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మే 7నుంచి తలపెట్టిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జేఏసీ నేతలతో జరిగిన చర్చలు విజయవంతమవడంతో, సమ్మెను వెనక్కి తీసుకుంటున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి.ఈ చర్చల్లో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, టిజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ పాల్గొన్నారు. చర్చల్లో ప్రభుత్వ ప్రతినిధులు సంస్థ పరిరక్షణ, కార్మిక సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యాలకు తాము ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే, కార్మికుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రితో కలిసి చర్చిస్తామని హామీ ఇచ్చారు.ముఖ్యంగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, వేతన సవరణ, ఉద్యోగ భద్రత, కారుణ్య నియామకాలు వంటి అంశాలపై ప్రభుత్వ ప్రతినిధులు సానుకూలంగా స్పందించినట్లు జేఏసీ నేతలు తెలిపారు. విద్యుత్ బస్సుల విషయమై కూడా ప్రభుత్వం స్పందించి, ఆర్టీసీ కోసం విద్యుత్ బస్సుల కొనుగోలు పై చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్టు వెల్లడించారు.
Rtc Strike : ఆర్టీసీ సమ్మె తాత్కాలిక వాయిదా
ప్రస్తుతం సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని, అయితే డిమాండ్లపై పరిష్కారం లేకపోతే భవిష్యత్తులో మళ్లీ సమ్మెకు దిగుతామని జేఏసీ నేతలు హెచ్చరించారు. వేతన సవరణ, అలవెన్సుల అమలు, 2017 నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలు, కొత్త నియామకాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు.బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై గెజిట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమ మేనిఫెస్టోలో ఆ హామీని ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు అమలులోకి రాలేదని వారు గుర్తు చేశారు.జేఏసీ నేతలు తమ డిమాండ్ల సాధనకు ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుని ఉద్యోగుల భవిష్యత్తును సురక్షితంగా మార్చాల్సిన అవసరం ఉందని వాదిస్తున్నారు.
Read More : Gali Janardhan Reddy: ఎట్టకేలకు గాలి జనార్ధన్ రెడ్డి కి 7 ఏళ్ల జైలు శిక్ష