ప్రస్తుతం రాజకీయ నాయకుల విశ్వసనీయత ఎలా పడిపోతోందో, అదే స్థాయిలో జర్నలిస్టు (Journalist)ల విశ్వసనీయత కూడా క్షీణిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొన్ని పార్టీలు తమకంటూ పత్రికలు, మీడియా సంస్థలు ప్రారంభించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు.‘నవ తెలంగాణ’ పత్రిక ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి (Revanth Reddy) నిజమైన జర్నలిస్టులు ఒక గీత గీయాల్సిన సమయం వచ్చిందన్నారు. జర్నలిజం పేరుతో అరాచకం సృష్టిస్తున్న వారిని వేరుచేయాలని పిలుపునిచ్చారు.

సోషల్ మీడియా దుర్వినియోగంపై హెచ్చరిక
“గతంలో జర్నలిస్టులను గౌరవించేవాళ్లం. వారి సలహాలతో పనిచేసేవాళ్లం. కానీ ఇప్పుడు కొందరు సోషల్ మీడియా పేరుతో పాకిస్థాన్ ఏజెంట్లుగా మారిపోయారు. ఇలాంటి చర్యలు అడ్డుకోకపోతే దేశ భద్రతకే ప్రమాదం వస్తుంది,” అని ఆయన హెచ్చరించారు.ప్రజా సమస్యల పట్ల కట్టుబడి పనిచేసే పత్రికలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. “మసాలా వార్తలు రాసే పత్రికలకు ఇచ్చే ప్రకటనలు, ‘నవ తెలంగాణ’కు కూడా సమానంగా ఇవ్వాలి,” అని మంత్రికి సూచించారు.ప్రజా సమస్యల పరిష్కారంలో కమ్యూనిస్టుల పాత్రను ఉప్పుతో పోల్చుతూ, “వంటలో ఉప్పు లేకపోతే రుచి రాదు. అలాగే ఎర్రజెండా గొంతు వినిపించినప్పుడే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది,” అన్నారు.
తప్పులను సరిదిద్దే ధైర్యం
ప్రభుత్వం చేసిన మంచి పనులు మైకులో చెప్పాలని, తప్పులు చేస్తే పత్రికల్లో రాయాలని ఆయన అభిప్రాయపడ్డారు. విమర్శలను స్వీకరించి సరిదిద్దుకోవడానికి తాము సిద్ధంగా ఉంటామని తెలిపారు.భవిష్యత్తులో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పనిచేస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also : ACB : తెలంగాణ లో దూకుడు పెంచిన ఏసీబీ