తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి (Revanth Reddy) మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari) ని కలిశారు. ఇరువురి మధ్య రాష్ట్ర రహదారుల అభివృద్ధి, కొత్త ప్రాజెక్టుల ఆమోదం వంటి పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి.ఈ సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్ (నార్త్ పార్ట్) అంశాన్ని ప్రస్తావించారు. దాదాపు 90 శాతం భూ సేకరణ పూర్తయ్యిందని, పనుల ప్రారంభానికి కేంద్ర ఆర్థిక శాఖ, కేబినెట్ అనుమతులు త్వరగా రావాలని కోరారు. దీంతో ప్రాజెక్ట్ పనులు ఆలస్యం కాకుండా ముందుకు సాగుతాయని సీఎం స్పష్టం చేశారు.
సౌత్ పార్ట్ అనుమతులపై విజ్ఞప్తి
సీఎం రేవంత్రెడ్డి రీజినల్ రింగ్ రోడ్ (సౌత్ పార్ట్) విషయంలో కూడా చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్కు అనుగుణంగా అనుమతులు ఇవ్వాలని గడ్కరిని కోరారు. ఈ రోడ్ పూర్తి అయితే హైదరాబాద్ ట్రాఫిక్ భారాన్ని తగ్గించడమే కాకుండా, రాష్ట్ర అభివృద్ధికి కొత్త అవకాశాలు తెరవబడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.రావిర్యాల – ఆమన్గల్ – మన్ననూర్ రహదారిని నాలుగు వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారిగా అభివృద్ధి చేయాలని సూచించారు. అదేవిధంగా మన్ననూర్ – శ్రీశైలం (ఎన్హెచ్ 765) మధ్య నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని గడ్కరిని కోరారు. ఈ మార్గం పూర్తయితే యాత్రికులు, ప్రయాణికులు సులభంగా చేరుకోగలరని సీఎం చెప్పారు.సీఎం రేవంత్రెడ్డి మరో కీలక ప్రతిపాదనను కూడా ముందుకు తెచ్చారు. హైదరాబాద్ నుంచి మంచిర్యాల మధ్య కొత్త గ్రీన్ఫీల్డ్ రహదారిని జాతీయ రహదారిగా గుర్తించాలని కోరారు. ఈ రహదారి నిర్మాణం వల్ల ఉత్తర తెలంగాణ ప్రాంతానికి రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని ఆయన చెప్పారు.
12 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారి ప్రాజెక్ట్
హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం కోసం అనుమతులు ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ రహదారి పూర్తైతే రెండు రాష్ట్రాల మధ్య వాణిజ్య, పరిశ్రమల రంగాలకు ఊతమిస్తుందని ఆయన వివరించారు.సమావేశం ముగిసిన తరువాత, రాష్ట్ర రవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర సహకారం తప్పనిసరి అని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. జాతీయ రహదారులు విస్తరించటం వల్ల పెట్టుబడులు పెరుగుతాయని, పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.
Read Also :