తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం కొత్త రేషన్ కార్డుల (Ration Cards) పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. ఈ నెల 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గతంలో దరఖాస్తు చేసిన వేలాది మంది పేద కుటుంబాలు ఈ కొత్త కార్డుల కోసం దశాబ్దం పైగా ఎదురుచూశారు. జనవరి 26న దరఖాస్తుల స్వీకరణ మొదలైనప్పటి నుంచి ప్రభుత్వ యంత్రాంగం ఈ కార్యక్రమానికి శ్రమిస్తోంది.
ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులు
ఈసారి జారీ చేయబోయే రేషన్ కార్డులు పూర్తిగా ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన స్మార్ట్ కార్డులు(Smart Cards )గా ఉండబోతున్నాయి. ఇవి ఏటీఎం కార్డు సైజులో ఉంటాయి. ప్రతి కార్డు మీద బార్కోడ్, క్యూఆర్ కోడ్లు ఉంటాయి. రేషన్ డీలర్లు ఈ కార్డులను స్కాన్ చేసి సరుకులు జారీ చేస్తారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఫోటోతోపాటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రాలు కూడా కార్డుపై ఉండనున్నాయి. ముఖ్యంగా ఈ కార్డులు ఆధార్తో లింక్ చేయబడి ఉండటంతో అక్రమాలకు అవకాశమే ఉండదని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.
రాజకీయ లబ్ధి దృష్టిలో పెట్టుకుని వేగంగా అమలు
రాష్ట్రంలో వచ్చే మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రేషన్ కార్డుల పంపిణీ పాలకులకు రాజకీయంగా కూడా కీలకమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ప్రజలలో విమర్శలు వచ్చాయి. అదే కారణంగా ఎన్నికల్లో ఓటమికి కూడా ఇది ఒక ప్రధాన అంశంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంటనే దృష్టి సారించి, పథకాన్ని వేగవంతం చేసింది. దీంతో పేదల హృదయాల్లో విశ్వాసం పెంచుకునే ప్రయత్నం జరుగుతోంది.
Read Also : Telangana Govt : మహిళలకు గిఫ్ట్ అందించబోతున్న తెలంగాణ సర్కార్