తెలంగాణ రాజధాని హైదరాబాద్ను దేశంలోనే కీలకమైన రవాణా కేంద్రంగా మార్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రణాళిక సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించిన ఏడు హైస్పీడ్ రైల్వే కారిడార్లలో మూడు హైదరాబాద్తో అనుసంధానం అవుతుండటంతో, వీటన్నింటికీ శంషాబాద్ను ప్రధాన హబ్గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకొని ఉన్న బహదూర్గూడ ప్రాంతంలోని సుమారు 650 ఎకరాల ప్రభుత్వ భూమిని హైస్పీడ్ (బుల్లెట్) రైళ్ల టెర్మినల్ కోసం సేకరించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు కేంద్రం కూడా సుముఖత వ్యక్తం చేయడంతో, విమాన ప్రయాణికులకు నేరుగా బుల్లెట్ రైలు కనెక్టివిటీ లభించే అరుదైన అవకాశం దక్కనుంది.
ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే దక్షిణ భారతదేశ రవాణా ముఖచిత్రమే మారిపోనుంది. గంటకు 300 నుండి 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ బుల్లెట్ రైళ్ల ద్వారా హైదరాబాద్ నుండి బెంగళూరుకు కేవలం 2 గంటల్లో, చెన్నైకి 2.5 గంటల్లో, మరియు పుణెకు 3.5 గంటల్లో చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ నగరాలకు చేరుకోవడానికి పడుతున్న 8 నుండి 11 గంటల సమయం గణనీయంగా తగ్గనుంది. కేవలం ప్రయాణ సమయమే కాకుండా, విమానాశ్రయం పక్కనే ఈ టెర్మినల్ రావడం వల్ల సరుకు రవాణా (లాజిస్టిక్స్) రంగం కూడా అద్భుతమైన వృద్ధిని సాధిస్తుంది. ఈ మార్గాలను ఎలివేటెడ్ కారిడార్లుగా నిర్మించనుండటం వల్ల భూసేకరణ సమస్యలు కూడా తక్కువగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
శంషాబాద్ హబ్గా మారడం వల్ల తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతం లభించనుంది. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా రియల్ ఎస్టేట్, ఐటీ, ఫార్మా, టూరిజం వంటి రంగాల్లో సుమారు 10 నుండి 15 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. టెర్మినల్ పరిసరాల్లో అంతర్జాతీయ స్థాయి హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, ఐటీ పార్కులు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. 2034 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే ఈ ప్రాజెక్టు, హైదరాబాద్ను అంతర్జాతీయ బిజినెస్కు ‘గేట్వే’గా మార్చడమే కాకుండా, దేశ రాజకీయ మరియు ఆర్థిక రంగాల్లో తెలంగాణ ప్రాధాన్యతను మరింత పెంచనుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com