తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు గు ప్పించారు. మీడియాతో జరిగిన చిట్చాట్ సందర్భంగా చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి.
ఘాటు విమర్శలు
రాయలసీమ లిఫ్ట్కి అనుమతి ఇచ్చింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించిన సీఎం రేవంత్, గత పాలనలో తాను ఎదుర్కొన్న సమస్యలపై ఘాటు విమర్శలు చేశారు. “కేసీఆర్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఏపీతో తలనొప్పి వచ్చేది కాదు” అని అన్నారు. బీఆర్ఎస్ అధినేతను “చెల్లని రూపాయి” అని సంబోధించి,కేసీఆర్ను విమర్శించేందుకు సీఎం స్థాయి సరిపోదా ? అన్నారు.కేటీఆర్ గురించి మాట్లాడటమే “టైమ్ వేస్ట్” అని వ్యాఖ్యానించిన సీఎం, “ఆయన ఓ పిచ్చోడు” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ చేసిన ఆరోపణలకు బదులుగా “క్రిమినల్స్ ఎప్పుడూ కేసులకు భయపడరు. కేసులకు భయపడితే క్రైమ్ చేయరు” అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. “స్పైడర్ సినిమాలో విలన్ లానే కేసీఆర్, కేటీఆర్, హరీష్లు వ్యవహరిస్తున్నారు” అని విమర్శించారు.
కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడ?
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి మెట్రో రైలును తానే తీసుకొచ్చానని చెప్పుకుంటున్నారని, అయితే “ఆయన తెచ్చిన మెట్రో ఎక్కడుందో చెప్పాలి” అని సీఎం నిలదీశారు. తాను చూసింది జైపాల్ రెడ్డి తెచ్చిన మెట్రో మాత్రమే అని చెప్పారు. తెలంగాణకు కేంద్ర నిధులు తీసుకొస్తే “మేము కిషన్ రెడ్డిని సన్మానం చేస్తాం” అని అన్నారు.

రీజనల్ రింగ్ రోడ్డు
రీజనల్ రింగ్ రోడ్డు మంజూరు చేశామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని, అదే ఇవ్వమని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడడం లేదని ఆరోపించిన రేవంత్, “సబర్మతి, యమునా, గంగా నదుల ప్రక్షాళనకు నిధులు ఇస్తున్న కేంద్రం, మూసీ నదికి మాత్రం ఎందుకు నిధులు ఇవ్వడం లేదు?” అని ప్రశ్నించారు.
99 సార్లు ఢిల్లీకి వెళ్తా
తన ఢిల్లీ పర్యటన గురించి ప్రస్తావించిన సీఎం రేవంత్, “తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం 39 సార్లు కాకపోతే 99 సార్లు ఢిల్లీకి వెళ్తా” అని తేల్చి చెప్పారు. “ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి రాష్ట్రానికి కావాల్సినవి తెచ్చుకుంటా” అని స్పష్టం చేశారు.
కేటీఆర్ వ్యాఖ్యలు
టీడీఆర్ కుంభకోణం ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. “హైదరాబాద్ మహానగరంలో టీడీఆర్ షేర్లను రేవంత్ రెడ్డి అనుచరులు అడ్డగోలుగా కొంటున్నారు” అని ఆయన ఆరోపించారు. త్వరలో ఎఫ్ఎస్ఐ అమలు చేసి, టీడీఆర్లను అధిక ధరలకు అమ్మేందుకు కుట్ర జరుగుతోందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.