Revanth Reddy : నరేంద్ర మోదీ మంత్రులకు పెద్దన్న లాంటి వారు: రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పెద్దన్న లాంటి వారని, అలాంటి వ్యక్తిని కలవడంలో రాజకీయం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తన ఢిల్లీ పర్యటన గురించి అసత్య ప్రచారం జరుగుతోందని, తాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వెళ్లలేదని స్పష్టం చేశారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిర్ణయాలు కీలకమని, అందుకే కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు కొనసాగించాలని అభిప్రాయపడ్డారు.కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని మోదీని కలిసినట్లు వెల్లడించారు.ప్రధాని పట్ల గౌరవం తమ సాంస్కృతిక విలువల్లో భాగమని,కానీ రాజకీయాల్లో తాను కాంగ్రెస్ నేత, మోదీ బీజేపీ నాయకుడని స్పష్టంగా చెప్పారు. అవసరమైతే పార్టీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కూడా ఢిల్లీకి తీసుకెళ్లుతామని తెలిపారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఇప్పటికే నాలుగుసార్లు కలిసినట్లు, నిర్మలా సీతారామన్,అమిత్ షాలను కూడా కలిసి చర్చించినట్లు చెప్పారు.
బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నగర నిర్మాణం పూర్తిగా విచ్ఛిన్నమైందని ఆరోపించారు. చెరువులు, కుంటలు పూర్తిగా కనుమరుగయ్యాయని, నగరంలో మురుగు కాల్వల పరిస్థితి దయనీయంగా మారిందని మండిపడ్డారు. నగరాన్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తుంటే అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ను తీర్చిదిద్దే ప్రయత్నాలను అడ్డుకోవద్దని హితవు పలికారు.