తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) బీసీ రిజర్వేషన్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించినట్టు తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్, ఈ బిల్లు త్వరగా ఆమోదం పొందితేనే హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబరు లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ బిల్లు కోసం విపక్ష కూటమి సహకారాన్ని కూడా కోరుతున్నామని అన్నారు.
బీజేపీపై ద్వంద్వ వైఖరి ఆరోపణలు
బీజేపీ నాయకులు బీసీ రిజర్వేషన్ల(BC Rreservation)పై ఏకమైన వైఖరిని చూపడం లేదని రేవంత్ ఆరోపించారు. అసెంబ్లీలో బిల్లుకు మద్దతు ఇచ్చిన బీజేపీ ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలంటూ వేరే అభిప్రాయం చెబుతుందన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి నేతలు మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముస్లిం రిజర్వేషన్లపై నోరు మూసుకుంటున్నారని మండిపడ్డారు. ఒకే దేశంలో రెండు రకాల ధోరణులు ఎలా నడుస్తాయంటూ ప్రశ్నించారు.
కులగణన సర్వే, ఈడబ్ల్యూఎస్పై స్పష్టత
కులగణన సర్వే పూర్తిగా పారదర్శకంగా, వ్యక్తిగత వివరాలు వెలువరించకుండా నిర్వహించామని సీఎం రేవంత్ తెలిపారు. దాదాపు 4 శాతం మంది తమకు కులం లేదని పేర్కొన్న విషయం గమనార్హమని , రిజర్వేషన్లలో మత ప్రస్తావన లేదని స్పష్టం చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా ఇప్పటికే 50 శాతం రిజర్వేషన్ గడిని కేంద్రం దాటి పోయిందని గుర్తు చేస్తూ, అదే విధానం బీసీలకు వర్తించకూడదా అని ప్రశ్నించారు. కేంద్ర పదవుల్లో బీసీలకు అన్యాయం జరుగుతోందని, దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read Also : Rajagopal : మంత్రి పదవి కంటే కూడా మునుగోడు ప్రజలే ముఖ్యం – రాజగోపాల్