ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. “ఉల్టా చోర్ కోత్వాల్ కో ఢాంటే” అన్నట్లు సీఎం వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ కీలక నేతలు మాత్రమే కాకుండా, మంత్రివర్గ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారంటూ రేవంత్పై ఆరోపణలు చేశారు. రెండు మంత్రుల మధ్య జరిగిన సరదా సంభాషణను ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని వారిలో ఒకరిని పిలిపించి క్లాస్ తీసుకున్నారని తెలిపారు.
ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర బీజేపీ మద్దతు
రేవంత్ రెడ్డి ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర బీజేపీ మద్దతు ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ పేర్కొన్నారు. హరీష్ రావుతో జర్నలిస్టు సంభాషణను సీఎం ఎలా తెలుసుకున్నారు అని ప్రశ్నిస్తూ, ఫోన్ ట్యాపింగ్ తప్ప మరో మార్గం లేదని అన్నారు. తనకు జూలై 14న ట్యాపింగ్ కేసులో నోటీసులు వచ్చాయని, కానీ జూలై 7న ఓ మీడియా ఆ నోటీసుల గురించి రాసిందని, దీనిపై ప్రశ్నించారు. విచారణ వివరాలు మీడియాలో ముందే ఎలా వస్తున్నాయని నిలదీశారు. ఈ వ్యవహారాన్ని హైకోర్టులో సీల్డ్ కవర్లో ఫోన్ ట్యాపింగ్ జాబితా సమర్పించాలని డిమాండ్ చేశారు.
హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్
టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం దేశ భద్రతకే సంబంధించి ట్యాపింగ్ చేయాల్సి ఉంటుందని, కానీ ప్రస్తుత పరిణామాలు చట్ట విరుద్ధమని ఆర్ఎస్ ప్రవీణ్ అభిప్రాయపడ్డారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అవసరమైతే కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ ప్రైవేట్ స్పై ఏజెన్సీలతో ట్యాపింగ్ చేస్తున్నారని, పెగాసస్ సాఫ్ట్వేర్ వాడే అవకాశం ఉన్నదన్న అనుమానాలు ఉన్నాయని తెలిపారు. సీఎం ప్రతీకార రాజకీయాలే కాకుండా తానే అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని త్వరలో గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
Read Also : social service : చండీగఢ్ లో ప్రతి రోజు చెత్తను ఏరివేసే రిటైర్డ్ పోలీస్ అధికారి