తెలంగాణ (Telangana) రాష్ట్రంలో సామాన్య ప్రజలకు సరుకుల సరఫరా కోసం ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ కార్డుల (Ration card) వ్యవస్థ ఇప్పుడు సర్వేల, విచారణల దశలోకి ప్రవేశించింది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం అనర్హులైనవారిపై చర్యలు తీసుకునే దిశగా వేగంగా కదులుతోంది. ముఖ్యంగా గత ఆరు నెలల నుంచి రేషన్ సరుకులు తీసుకోని కార్డుదారులను లక్ష్యంగా చేసుకుని వారి కార్డులను రద్దు చేయాలన్న సంకల్పంతో అధికారులు ముందుకు వెళ్తున్నారు.
రేషన్ కార్డుల దుర్వినియోగం
రేషన్ వ్యవస్థ వాస్తవంగా దేశంలోని పేద ప్రజలకు జీవనాధారంగా ఉంటుంది. కానీ కొంతమంది ఆధికారికంగా పేదరిక రేఖకు దిగువన లేనప్పటికీ రేషన్ కార్డులు పొందినట్లు విచారణలో వెల్లడైంది.
గత ఆరు నెలలుగా రేషన్ తీసుకోనివారు – లక్షల సంఖ్యలో కార్డులు కట్
ప్రభుత్వ నివేదికల ప్రకారం, రేషన్ తీసుకోని కార్డు దారులపై విచారణ ఆరు నెలల కంటే ఎక్కువ కాలం రేషన్ కార్డులు ఉన్నప్పటికీ రేషన్ తీసుకోని కార్డుదారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష యాభై తొమ్మిది వేల మంది ఉన్నట్టు గుర్తించిన అధికారులు, ఇక ఈ కార్డు దారులను విచారణ చేయనున్నట్టు సమాచారం. ఈ విచారణలో వీరు అనర్హులు అని తేలితే కార్డులు రద్దు చేయాలని కేంద్రం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది .
నకిలీ పత్రాలతో పొందినవారికి కఠిన చర్యలు
కేవలం రేషన్కే కాకుండా, ప్రభుత్వ పథకాలు, స్కాలర్షిప్లు, ఆరోగ్య భీమా పథకాలు వంటి ఎన్నో ప్రయోజనాలను రేషన్ కార్డుల ఆధారంగా పొందే వీలుండటంతో కొంతమంది అసలైన అర్హత లేకపోయినా ఈ కార్డులను తప్పుడు మార్గాల్లో పొందినట్లు సమాచారం. నకిలీ రేషన్ కార్డులను రద్దు చేయాలని నిర్ణయం అయితే ఇప్పటికే 80% కార్డులపై అధికారులు విచారణ చేసినట్టు సమాచారం. ఇప్పటివరకు 30 శాతం అనర్హులుగా తేలినట్టు తెలుస్తుంది. మొత్తం కార్డుదారులలో చాలామంది ఆరు నెలలకు పైగా రేషన్ తీసుకోకపోగా మరికొంతమంది నకిలీ ధృవీకరణ పత్రాలను సమర్పించి రేషన్ కార్డులు పొందిన వారు ఉన్నారని సమాచారం. ఏది ఏమైనా పూర్తిగా వీరి పైన విచారణ జరిపి నకిలీ రేషన్ కార్డులను రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది.
సామాన్యుల ఆశ – నిజమైన లబ్ధిదారులకు లబ్ది
నిత్యావసరాలు, ముఖ్యంగా బియ్యం, పప్పులు, చక్కెర, నూనె వంటి రేషన్ సరుకుల కోసం నెలకు నెల ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితిలో నకిలీ కార్డుదారులు తీసుకుంటున్న లబ్ధుల వల్ల అసలు అవసరమైన వారికి నష్టం జరుగుతోందన్న వాదన జమైంది. అందుకే సామాన్య ప్రజలు ఈ విచారణను సమర్థిస్తున్నారు. “వాస్తవంగా అర్హత ఉన్నవారికి మాత్రమే లబ్ధి జరగాలి. మాకు అవసరమైన సరుకులు అందించాలి” అని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తెలంగాణలో నకిలీ రేషన్ కార్డులపై జరుగుతున్న ఈ చర్యలు ప్రజా ధనాన్ని కాపాడడంలో, వ్యవస్థ పరంగా న్యాయం జరిగేలా చూసే దిశగా ఉన్నాయి.
Read also: KCR : కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరు వాయిదా