తెలంగాణలో పౌర సరఫరాల శాఖ కొత్త రేషన్ కార్డుల జారీ, సభ్యుల చేరికలు, మరియు బియ్యం కోటాలో పెంపు వంటి అనేక కీలక నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్న అర్హులైన పౌరులకు ఇది శుభవార్తగా చెప్పవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త కార్డుల జారీ పైన స్పష్టత ఇచ్చింది. అదే విధంగా కొత్తగా రేషన్ లబ్ది దారులకు సన్న బియ్యం పంపిణీ మొదలైంది.

కొత్తగా 11 లక్షల మంది లబ్ధిదారులుగా గుర్తింపు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 11 లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులుగా అర్హత పొందారు. వీరి చేరికతో రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 2.93 కోట్లకు చేరింది. ఇది రాష్ట్ర చరిత్రలో రేషన్ లబ్ధిదారుల పరంగా ఒక పెద్ద మార్పు. ప్రభుత్వం చేపట్టిన పర్యవేక్షణ, ఇంటింటి పరిశీలన, ఆధార్ ఆధారిత క్రాస్ వెరిఫికేషన్ వంటివి ఆధారంగా నిజంగా అర్హులైన కుటుంబాలకే కొత్త కార్డులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం 31,084 కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డులు మంజూరయ్యాయి. ఈ కార్డుల ద్వారా 93,584 మంది వ్యక్తులు లబ్ధిదారులుగా గుర్తింపు పొందారు.
పాత కార్డుల్లో అదనపు సభ్యుల చేర్పు – 10 లక్షలకు పైగా చేరిక
పాత కార్డుల్లో కొత్తగా 10,12,199 మంది సభ్యుల పేర్లు చేర్చారు. ఇవి వివాహం, కొత్త పిల్లల జననం, వేరే కుటుంబ విభజన వంటి కారణాలతో చోటు చేసుకున్న మార్పులు. ఇదే సమయంలో కొన్ని కుటుంబాలు తప్పులు, మరణాలు, వలసలు వంటి కారణాలతో సుమారు 7 లక్షల మంది సభ్యుల పేర్లు తొలగించారు. అయితే నికరంగా చూస్తే, కొత్తగా 12 లక్షల మందికి రేషన్ అందనున్నది. రేషన్ బియ్యం కోటా కూడా కొత్తగా చేరిన లబ్ధిదారులకు తగినట్లుగా పెంచబడింది. గత జనవరిలో 1.79 లక్షల టన్నులగా ఉన్న బియ్యం కోటా, మే నెల నాటికి 1.86 లక్షల టన్నులకు చేరింది. అదనంగా 4,431 టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఇది కొత్తగా చేరిన లబ్ధిదారులకు అనుగుణంగా పౌర సరఫరాల శాఖ వేసిన ప్రణాళికకు నిదర్శనం.
సభ్యుల చేర్పు,
ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం జనవరి నుండి మే మధ్యలో 19 లక్షలకు పైగా లబ్ధిదారుల వివరాలను గుర్తించింది. అయితే సాంకేతిక లోపాలు, డూప్లికేట్ ఆధార్, వలసల వంటి సమస్యల వల్ల 7 లక్షలకు పైగా పేర్లు తొలగించినట్లు అధికారులు ప్రకటించారు. వివాహం తరువాత వేరుగా జీవిస్తున్న యువతుల పేర్లను తల్లిదండ్రుల కార్డుల నుండి తొలగించి, కొత్తగా చేర్చడంలో కొన్ని పరిమితులు ఉన్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ ప్రస్తుత విధానం ప్రకారం, ఏడు సంవత్సరాల పైబడి ఉన్నవారికే రేషన్ బియ్యం కోటా కేటాయిస్తామని స్పష్టం చేశారు. పాత రేషన్ కార్డుల్లోని సభ్యులు వివిధ రకాల కారణాలతో తమ పేర్లను తొలగిస్తున్నా కొత్తగా సభ్యుల చేరికకు మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కొత్తగా చేరిన సభ్యుల్లో అర్హులను గుర్తించి వెంటనే వారి పేర్లను ఆ రేషన్ కార్డులో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read also: Bonus : తెలంగాణ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న ఏపీ దళారులు