हिन्दी | Epaper

Rahul Gandhi: వికారాబాద్‌లో రాహుల్ పర్యటన.. పీఏసీ సంయుక్త సమావేశం

Anusha
Rahul Gandhi: వికారాబాద్‌లో రాహుల్ పర్యటన.. పీఏసీ సంయుక్త సమావేశం

Rahul Gandhi: తెలంగాణలో, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేడు పర్యటించారు. వికారాబాద్‌లోని ఎస్‌ఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వేదికగా జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీల (PAC) సంయుక్త సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కలిసి వచ్చిన రాహుల్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి నేరుగా వికారాబాద్ చేరుకున్న రాహుల్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్వాగతం పలికారు.

Read Also: Khamenei death: ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిరసనలు

అనంతగిరి హిల్స్‌లో శిక్షణా శిబిరం: డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం

పీఏసీ సమావేశం అనంతరం రాహుల్ గాంధీ అనంతగిరి హిల్స్‌లోని హరిత రిసార్ట్‌కు చేరుకున్నారు. తెలంగాణ, ఏపీకి చెందిన నూతన డీసీసీ అధ్యక్షుల కోసం ఏర్పాటు చేసిన 10 రోజుల శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను ఎలా తీసుకెళ్లాలనే అంశాలపై డీసీసీ అధ్యక్షులకు రాహుల్ దిశానిర్దేశం చేశారు.

Rahul's visit to Vikarabad.. PAC joint meeting
Rahul’s visit to Vikarabad.. PAC joint meeting

ఈ పర్యటనలో భాగంగా తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికలపై రాహుల్ గాంధీ రాష్ట్ర నాయకత్వంతో చర్చించారు. ఈ నెల‌ 16న ఎన్నికలు జరగనుండగా, నామినేషన్ల దాఖలుకు 5 చివరి తేదీ. కాంగ్రెస్ సీనియర్ నేతలు శ్యామ్ మోహన్ అనంతుల, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వి. హనుమంతరావు, ప్రణాళికా సంఘం ఛైర్మన్ జి. చిన్నారెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ ఎం. కోదండరెడ్డి తదితరులు రాజ్యసభ టికెట్లను ఆశిస్తున్నారు.

ప్రస్తుతం సిట్టింగ్ సభ్యులుగా ఉన్న అభిషేక్ మను సింఘ్వీ, కేఆర్ సురేశ్ రెడ్డి పదవీకాలం ఏప్రిల్ 9తో ముగియనుంది. 119 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 66 మంది ఎమ్మెల్యేలు, మిత్రపక్షం సీపీఐకి ఒకరు, స్నేహపూర్వక పార్టీ ఎంఐఎంకు ఏడుగురు సభ్యుల మద్దతు ఉండటంతో రెండు స్థానాలనూ సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉంది. సింఘ్వీని మళ్లీ నామినేట్ చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అభ్యర్థులపై అధికారిక ప్రకటన ఈ నెల‌ 4న వెలువడే అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870