హైదరాబాద్‌ జూపార్క్‌లో భారీగా పెరిగిన ధరలు

Read Time:  1 min
hyderabad zoo park
hyderabad zoo park
FONT SIZE
GET APP

హైదరాబాద్‌లోని ప్రసిద్ధ నెహ్రూ జంతు ప్రదర్శనశాల (జూపార్క్)లో ప్రవేశ రుసుములను మరియు వివిధ సేవల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (జీపాట్) 13వ గవర్నరింగ్ బాడీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెరిగిన ధరలు 2024 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్నట్లు జూపార్క్ క్యురేటర్ జె. వసంత వెల్లడించారు. టిక్కెట్ ధరల పెరుగుదల వెనుక నిర్వహణ ఖర్చులు, సదుపాయాల మెరుగుదల, జంతువుల సంరక్షణ వంటి కారణాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

hyderabad zoo park fee

ప్రవేశ రుసుములతో పాటు వివిధ సేవల ఖర్చులు

తాజా మార్పుల ప్రకారం, జూపార్క్‌లో పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.40 ప్రవేశ రుసుముగా వసూలు చేయనున్నారు. అదనంగా, ఫోటో కెమెరాకు అనుమతి రూ.150, వీడియో కెమెరాకు రూ.2,500, సినిమా చిత్రీకరణకు రూ.10,000గా నిర్ణయించారు. అలాగే, పార్కులో రైలు ప్రయాణానికి పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.40గా నిర్ణయించగా, బ్యాటరీ వాహన సౌకర్యం కోసం పెద్దలకు రూ.120, పిల్లలకు రూ.70 వసూలు చేయనున్నారు. సఫారీ పార్క్ డ్రైవ్ సీఎన్జీ బస్సు ఏసీ కోసం రూ.150, నాన్-ఏసీ కోసం రూ.100గా నిర్ణయించారు. అదనంగా, ప్రత్యేక వాహనాల కోసం 60 నిమిషాల ప్రయాణానికి 11 సీట్ల వాహనానికి రూ.3,300, 14 సీట్ల వాహనానికి రూ.4,000గా నిర్ణయించారు.

వాహనాల పార్కింగ్ ఛార్జీలు

జూపార్క్ సందర్శనకు వచ్చే ప్రజల వాహనాల పార్కింగ్ రుసుములను కూడా అధికారులు సవరించారు. సైకిల్ కోసం రూ.10, ద్విచక్ర వాహనం కోసం రూ.30, ఆటోకు రూ.80, కారు లేదా జీపుకు రూ.100, టెంపో లేదా తూఫాన్ వాహనానికి రూ.150, 21 సీట్ల మినీ బస్సుకు రూ.200, 21 సీట్లు కలిగిన పెద్ద బస్సు కోసం రూ.300 వసూలు చేయనున్నారు. ఈ పెరుగుదల పర్యాటకులకు కొంత భారం అయినప్పటికీ, జూపార్క్ నిర్వహణ మెరుగుదల, జంతువుల సంరక్షణ కోసం అవసరమని అధికారులు స్పష్టం చేశారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.