మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం సత్తుపల్లిలో జరిగిన భారీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఎన్నికల ప్రచారంలో భాగంగా విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ‘ప్రజా పాలన’ పట్ల ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో విపక్షాల ఎత్తుగడలను చిత్తు చేస్తూ ప్రతి మున్సిపాలిటీలోనూ మూడు రంగుల జెండా రెపరెపలాడుతుందని స్పష్టం చేశారు.
Research: కేంద్ర బడ్జెట్లో గ్రహాంతర పరిశోధనలకు పెద్దపీట
సత్తుపల్లి పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి, పార్టీ ఇంచార్జ్ మట్టా దయానంద్ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను పరిచయం చేస్తూ, పార్టీ శ్రేణుల్లో మంత్రి కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో మొదటి నుంచీ కాంగ్రెస్ బలంగా ఉండటం, దానికి తోడు మంత్రి పొంగులేటి వ్యక్తిగత ఇమేజ్ తోడవ్వడంతో అభ్యర్థులు తమ గెలుపుపై ఆశాభావంతో ఉన్నారు. కేవలం సంక్షేమ పథకాలే కాకుండా, స్థానికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారమే అజెండాగా కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది.
సత్తుపల్లి మున్సిపాలిటీలో ప్రస్తుతం కాంగ్రెస్, బిఆర్ఎస్ మరియు బిజెపి పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలతో కాంగ్రెస్ శిబిరంలో జోష్ పెరిగినప్పటికీ, ప్రతిపక్ష బిఆర్ఎస్ తన పట్టును కాపాడుకునేందుకు క్షేత్రస్థాయిలో గట్టి ప్రయత్నాలు చేస్తోంది. బిజెపి కూడా ఈసారి గణనీయమైన ఓట్లు సాధించాలని ప్రచారం ఉధృతం చేసింది. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, వార్డుల వారీగా అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అభివృద్ధి మంత్రం జపిస్తున్న అధికార పార్టీకి, స్థానిక సమస్యలపై నిలదీస్తున్న విపక్షాలకు మధ్య పోరు ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.