తెలంగాణ (Telangana) రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ల ట్యాపింగ్కు సంబంధించి సంచలన ఆరోపణలు వెలువడ్డాయి. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్, కేటీఆర్లదే పూర్తి బాధ్యత
మహేశ్ గౌడ్ మాట్లాడుతూ – గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అక్రమాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లదే పూర్తి బాధ్యత అని, వారి ప్రమేయం, కనుసన్నలతోనే ఈ మొత్తం వ్యవహారం నడిచిందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఈ కుంభకోణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరూ చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిందేనని, దోషులు ఎంతటి వారైనా జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన హెచ్చరించారు.
చట్టపరమైన చర్యలు తప్పవు – జైలే గమ్యం
హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్, ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఘాటుగా స్పందించారు. “గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, పలువురు పారిశ్రామికవేత్తల ఫోన్లను విచక్షణారహితంగా ట్యాప్ చేసిన పాపం బీఆర్ఎస్దే. కేవలం ప్రతిపక్షాలనే కాకుండా, సొంత పార్టీ నేతలను కూడా వారు వదల్లేదు. ఈ అక్రమ దందా అంతా కేసీఆర్, కేటీఆర్ ఆదేశాలు, వారి ప్రమేయంతోనే జరిగిందని మేము బలంగా విశ్వసిస్తున్నాం” అని ఆయన అన్నారు.
ఎస్ఐటీ వేగంగా దర్యాప్తు చేయాలి – బాధితుల పేర్లు వెలికి తీయాలి
ఫోన్ ట్యాపింగ్ బాధితుల పేర్లను సిట్ (Special Investigation Team) తక్షణమే బయటపెట్టాలని మహేశ్ గౌడ్ డిమాండ్ చేశారు. “ఈ వ్యవహారంలో దోషులు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది” అని గౌడ్ స్పష్టం చేశారు