తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, 15 నెలల పాలనతోనే విసుగు చెంది పోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో అభివృద్ధి పూర్తిగా స్తంభించిందని, ప్రజా సమస్యలు పెరిగిపోతున్నాయని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి 35 సార్లు ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు? అని ప్రశ్నించారు. ఇప్పుడూ మళ్లీ హస్తిన వెళ్లి ప్రజల సమస్యలపై చర్యలు తీసుకోకుండా రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయం
రాష్ట్రంలోని రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. గత 48 గంటల్లో ఏకంగా ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, కానీ ప్రభుత్వం వాటిపై స్పందించలేదని విమర్శించారు. SLBC కాలువలో ఎనిమిది మంది ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే, ముఖ్యమంత్రి మాత్రం ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారని ఆయన ఆరోపించారు. రైతుల సమస్యలు, నీటి సౌకర్యాల అభివృద్ధి పూర్తిగా పట్టించుకోకుండా, పబ్లిసిటీ కోసం పాలనను గాలికొదిలేశారని మండిపడ్డారు.
తెలంగాణలో అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలోనే
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు బహిరంగంగా అర్థమయ్యాయని, త్వరలోనే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలోనే సాధ్యమవుతుందని, ప్రజలు మళ్లీ తమ పార్టీ వైపు మొగ్గుచూపే పరిస్థితి త్వరలోనే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగాల కల్పన వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.