సంగారెడ్డి జిల్లా పాశమైలారం (Pashamylaram) పారిశ్రామికవాడలోని సిగాచి సంస్థలో జరిగిన పేలుడు ఘటన దేశాన్ని కలిచివేసింది. ఈ ప్రమాదాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి “చాలా దురదృష్టకరమైన సంఘటన”గా అభివర్ణించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుతో కలిసి ఘటన స్థలాన్ని సందర్శించిన ఆయన, ఇప్పటి వరకు 48 మృతదేహాలు వెలికితీయబడినట్టు తెలిపారు. ఇంకా 11 మంది ఆచూకీ లభించాల్సి ఉందని వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. గతంలోనూ ఇలాంటే ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించి 11 మంది మృతి చెందారని గుర్తు చేశారు.
పరిశ్రమలపై తనిఖీల మోతాదు పెంచాలని సూచన
ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు కిషన్ రెడ్డి (Kishan Reddy). పరిశ్రమలలో తనిఖీలు నిజంగా జరుగుతున్నాయా? లేక కేవలం లంచాల కోసమేనా అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. పరిశ్రమల తనిఖీల ప్రక్రియను పటిష్టంగా మార్చాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించారు. సిగాచి సంస్థకు చెందిన మరో మూడు పరిశ్రమలనూ తనిఖీ చేయాలని సూచించారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదవారు పొట్టకూటి కోసం వస్తూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆయన అన్నారు.
ప్రభుత్వ సహాయం, కేంద్రం నుంచి భరోసా
ప్రమాదంలో మృతుల జాబితా వచ్చిన వెంటనే సంబంధిత రాష్ట్రాల్లో తమ పార్టీ తరఫున మద్దతు ఉంటుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. శిధిలాల కింద చిక్కుకున్న మృతదేహాల కోసం పోలీస్ జాగిలాలను వినియోగించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. పారిశ్రామిక ప్రాంతాల్లో ఎప్పుడైనా అపాత పరిస్థితుల్లో ఉపయోగపడేలా అంబులెన్స్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. “ఇది రాజకీయాల సమయం కాదు” అంటూ ఘాటుగా స్పందించిన కిషన్ రెడ్డి, బాధితులకు న్యాయం చేయడం ప్రాధాన్యమని స్పష్టం చేశారు.
Read Also : KCR : ఏపీకి మన నీటి హక్కులను ధారాదత్తం చేశారు – సీఎం రేవంత్