Vanajeevi Ramaiah : ప్రముఖ సామాజిక కార్యకర్త, జీవితమంతా మొక్కలు నాటేందుకే గడిపిన ప్రకృతి ప్రేమికుడు ‘వనజీవి’ రామయ్య ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కోటికి పైగా మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ఈయన చేసిన కృషికిగానూ కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించింది.

ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడం
ఖమ్మం రూరల్ మండలంలోని ముత్తగూడెం దారిపల్లి రామయ్య స్వగ్రామం. ఇక్కడే ఐదో తరగతి దాకా చదువుకున్నారు కూడా. ఆ సమయంలో మల్లేశం సర్ చెప్పిన మొక్కల పెంపకం పాఠాలు రామయ్యను బాగా ప్రభావితం చేశాయి. ఆపై పంటపొలాల కోసం చిన్నతనంలోనే రెడ్డిపల్లికి రామయ్య కుటుంబం మకాం మార్చింది. మల్లేశం సర్ పాఠాల స్ఫూర్తితో తన ఇంటిలోని 40 కుంటల స్థలంలో ఇల్లు పోను మిగతా జాగలో చెట్లు నాటి వాటిని ప్రాణప్రదంగా పెంచారు. అక్కడి నుంచి.. 43 ఏళ్లుగా రోడ్ల పక్కన ఖాళీ స్థలం, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలు, దేవాలయాలు.. ఇలా ఒకటేమిటి ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడం రామయ్యకు నిత్యకృత్యమైంది. వృత్తిరీత్యా కుండలు చేస్తూ, పాలు అమ్ముతూ ప్రవృత్తి రీత్యా వనపెంపకానికి అవిశ్రాంతంగా కృషి చేశారాయన.
మనవళ్లకు మొక్కల పేర్లు!
రామయ్యకు భార్య జానమ్మ, నలుగురు సంతానం. ఓవైపు కుటుంబ భారాన్ని మోస్తూనే.. నాలుగు దశాబ్దాలకు పైగా మొక్కలు నాటుతూ వచ్చారు. విశేషం ఏంటంటే.. మనుమళ్లు, మనుమరాళ్లకు కూడా ఆయన చెట్ల పేర్లే పెట్టాడు. ఒకామె పేరు చందనపుష్ప. ఇంకో మనుమరాలు హరిత లావణ్య. కబంధపుష్ప అని ఇంకో పాపకు పెట్టాడు. మరో మనవరాలికి వనశ్రీ అని నామకరణం చేశారు వనజీవి రామయ్య.
Read Also: టీపీసీసీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు?