Telangana Assembly : అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ పార్టీలు వాయిదా తీర్మానాలు కోరగా అందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నో చెప్పారు. ఇప్పటికే ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తున్నట్లుగా సభాపతులు ప్రకటించగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలు, పీఆర్సీ వెంటనే అమలు చేయాలని వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇక, బీజేపీ తెలంగాణలో కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జీఓ నెం.317పై చర్చకు పట్టబడుతూ వాయిదా తీర్మానమిచ్చింది.

స్పీకర్ ఆఫీసులో వాయిదా తీర్మానం
మరోవైపు సీపీఐ దళితులు గుడిసెలు వేసుకున్న స్థలాలను వారికే కేటాయించాలని కోరుతూ స్పీకర్ ఆఫీసులో వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇదిలాఉండగా, నేటితో సమావేశాలు ముగుస్తుండగా స్పీకర్ అనుమతితో డిప్యూటీ సీఎం సభలో కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. దానిపై చర్చ ముగిశాక కేంద్రం తీసుకురాబోతున్న లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
రైతాంగాన్ని కాపాడలన్న సోయిలేదు
కాగా, చట్ట సభలు అంటే దేవాలయాలతో సమానం కానీ.. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అబద్దాలు చెబుతున్నారు. మేం ఏదైనా మాట్లాడితే.. మా గొంతు నొక్కుతున్నారు. రాష్ట్ర రైతాంగాన్ని కాపాడలన్న సోయిలేదు. రైతులు ఇబ్బంది పడవద్దని కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు తెచ్చారు. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ హామీలను పక్కన పెట్టింది. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లో ఉన్నాయి అని ఎమ్మెల్సీ షేరీ సుభాష్ రెడ్డి పేర్కొన్నారు.