News Telugu: హైదరాబాద్ కూకట్ పల్లిలో జరిగిన బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య అనంతరం ఒక బాలుడి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు చేశారు. సమీప అపార్ట్మెంట్లో నివాసం ఉండే పదో తరగతి విద్యార్థి(15) ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. మూడ్రోజుల ముందు నుంచే ఇంటర్నెట్లో ‘దొంగతనం ఎలా చేయాలి, ఎవరైనా అడ్డిస్తే ఎలా తప్పించుకోవాలి’ అనే అంశాలు అన్వేషించడంతోపాటు అవన్నీ కాగితంపై రాసుకున్నాడని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం.

వివరాల ప్రకారం..
సంగారెడ్డి జిల్లా ముక్తాక్యాసారానికి చెందిన కృష్ణ, రేణుక దంపతులు కూకట్పల్లి (Kukatpally) సంగీత్నగర్ నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె సహస్ర(10), కుమారుడు (8) సంతానం. సహస్ర బోయినపల్లి కేంద్రీయ విద్యాలయంలో ఐదో తరగతి చదువుతోంది. ఈ నెల 18న ఉదయం కృష్ణ, రేణుక పనులకు, కుమారుడు సమీపంలోని బడికి వెళ్లాడు. పాఠశాలకు సెలవు కావడంతో బాలిక ఇంట్లో ఉంది. కుమారుడికి లంచ్బాక్సు ఇచ్చేందుకు మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వచ్చిన తండ్రి కుమార్తె రక్తపు మడుగులో ఉండటాన్ని గుర్తించి హతాశుడయ్యాడు. ఎటువంటి ఆనవాళ్లు దొరక్కపోవడంతో కేసు పోలీసులకు సవాల్ గా మారింది. 300 మందిని ప్రశ్నించినా ఫలితం లేకపోయింది.
పక్కన అపార్ట్మెంట్ లో నివసిస్తూ ఉండేవాడు..
ప్రకాశం జిల్లాకు చెందిన దంపతులు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చి కూకట్పల్లి సంగీత నగర్లో హత్యకు గురైన బాలిక ఇంటి సమీపంలోని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. కుటుంబ పెద్ద కిరాణా దుకాణం నడిపి, నష్టాలు రావడంతో మూసివేశాడు. ఆయన భార్య గచ్చిబౌలిలోని ప్రైవేటు ల్యాబ్లో పనిచేస్తున్నారు. వీరి కుమారుడు (హత్య కేసులో నిందితుడు), సహస్ర తమ్ముడు చదివే ప్రైవేటు పాఠశాలలోనే పదో తరగతి చదువుతున్నాడు. స్నేహితులతో ఎప్పుడూ క్రికెట్ ఆడుతూ పాఠశాలకు డుమ్మా కొట్టేవాడని, హారర్ సినిమాలు, క్రైమ్ వెబ్ సిరీస్ లు చూస్తూ గడిపేవాడని సమాచారం.

బ్యాట్ దొంగిలించాలనే భావించి పథకం అమలు
సహస్ర తమ్ముడి వద్ద ఉన్న ఖరీదైన క్రికెట్ బ్యాట్ను దొంగిలించాలని బాలుడు 3 రోజుల ముందే ప్రణాళిక (Plan 3 days in before)రచించాడు. సోమవారం ఉదయం కృష్ణ, రేణుక దంపతులు బయటకెళ్లడాన్ని గమనించాడు. సహస్ర, ఆమె తమ్ముడు కూడా పాఠశాలకు వెళ్లి ఉంటారని భావించి పథకం అమలుచేశాడు. ఇంటి తాళం తెరిచేందుకు వంట గదిలోని కత్తిని జేబులో పెట్టుకున్నాడు. తమ అపార్ట్మెంట్ పైనుంచి, పక్కనున్న భవనం పెంట్ హౌస్ మీదికి దూకాడు. ఒంటరిగా ఉన్న సహస్ర తలుపులు దగ్గరికి వేసుకుని, లోపల టీవీ చూస్తూ ఉండటాన్ని గమనించాడు. తలుపులు తోసుకుని రహస్యంగా లోపలికి వెళ్లాడు. ఓ గదిలో ఉన్న బ్యాట్ తీసుకొని బయటకు వస్తుండగా అలికిడికి బాలిక తల తిప్పిచూసింది. కేకలు వేయడంతోపాటు అతడి చొక్కా పట్టుకుని నిలదీసింది. అమ్మానాన్నలకు చెబుతానంటూ హెచ్చరించింది. దీంతో భయపడిన బాలుడు ఆమెను తోసేసి, పొట్టమీద కూర్చొని గొంతు నులిమి ఊపిరాడకుండా చేశాడు. ఆపై తన కత్తితో గొంతు కోయడంతోపాటు విచక్షణారహితంగా పొడిచాడు.
సాఫ్ట్వేర్ ఉద్యోగి తెలిపిన ప్రకారం
దీనితో కూకట్పల్లి ఏరియా మొత్తం భయాందోళనలకు గురైంది. సమాచారం అందుకున్న బాలానగర్, కూకట్పల్లి పోలీసులు, ఎస్వోటీ సిబ్బంది నాలుగు రోజులుగా వందలాది సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఆ ఇంట్లోకి ఎవరూ వెళ్లినట్టు కన్పించకపోవడంతో తెలిసిన వారి పనేనని అంచనాకు వచ్చారు. ఆ దిశగా విచారణ జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో నిందితుడు నివాసం ఉండే అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ‘హత్య జరిగిన రోజు ఓ బాలుడు గోడదూకి అపార్ట్మెంట్లోకి రావడాన్ని గమనించానంటూ’ కూకట్పల్లి పోలీసులకు సమాచారమివ్వడంతో ఆ దిశగా విచారించారు. అతను చెప్పిన వివరాల ఆధారంతో బాలుడు సమీపంలోని పాఠశాలలో చదువుతున్నట్లు గుర్తించి ఆరా తీశారు. బాలుడు హత్య జరిగిన రోజు పాఠశాలకు రాలేదని తెలుసుకున్నారు. అనంతరం ఇంటి వద్దనే బాలుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో నిజం అంగీకరించినట్టు సమాచారం. ‘హత్య చేసింది తానేనని, హత్య అనంతరం కత్తిని అక్కడే కడిగి ఇంటికి తీసుకొచ్చి రిఫ్రిజిరేటర్పై ఉంచానని, రక్తపు మరకలు అంటిన టీషర్ట్ను వాషింగ్ మెషిన్ వేశానని’ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: