కొన్ని సంఘటనలు చిన్న తప్పులతో ప్రారంభమై, చివరకు మానవ జీవితాన్ని మించిపోయే విషాదంలోకి మారతాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఓ దుర్ఘటన ఆహారం తీసుకునేటప్పుడు అప్రమత్తత లేకపోతే ఎంతటి ప్రమాదం ఎదురవుతుందో తెలియజేసింది. అప్పటి వరకు సరదాగా గడిపి మృత్యు ఒడికి చేరుకున్నాడు. మటన్ ముక్క ఓ వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకుంది. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.

మటన్ ముక్క గొంతులో ఇరుక్కొని మృతి
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొప్పాస్పల్లికి చెందిన రుత్వన్ తారా సింగ్ (వయసు 48) తన భార్యతో కలిసి నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సుద్దులతండాలోని బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యాడు. ఫంక్షన్ సందర్భంగా ఏర్పాటు చేసిన పంక్తి విందులో పాల్గొన్న తారా సింగ్ మటన్ కూరతో భోజనం చేస్తుండగా, మటన్ ముక్క ఒక్కసారిగా అతని గొంతులో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా గొంతులోని మటన్ ముక్క బయటకు రాలేదు. అతను తీవ్రంగా శ్వాస తీసుకోలేని స్థితిలోకి చేరిపోవడంతో అక్కడ ఉన్నవారు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. వైద్యులు పరీక్షించిన తర్వాత రుత్వన్ తారాసింగ్ మృతి చెందినట్లు ధృవీకరించారు. కొన్ని నిమిషాల క్రితమే కష్టపడి వంట చేసిన విందులో ఆనందంగా పాల్గొన్న వ్యక్తి ఇలా అకాల మరణానికి గురవడం చూసి అతని భార్యతో పాటు బంధువులు కన్నీటిలో మునిగిపోయారు.
పోలీసుల దర్యాప్తు
ఈ సంఘటన తర్వాత స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. రుత్వన్ తారాసింగ్ భార్య యమునాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ తీవ్ర శోకంలోకి నెట్టేసింది.
Read also: Congress : సీఎం రేవంత్ కు అందాలపోటీల పై ఉన్న శ్రద్ద రైతుల పై లేదు – కేటీఆర్