ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అందాల పోటీల్లో ఒకటైన మిస్ వరల్డ్ ఈ ఏడాది భారత్లో, అది కూడా మన తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో జరగడం గర్వకారణం. ప్రతిష్ఠాత్మక 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మే 10వ తేదీన ప్రారంభమై 31 వరకు జరగనున్న ఈ అంతర్జాతీయ అందాల పోటీల కోసం నగరం వేదిక కానుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 120 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఇప్పటికే హైదరాబాద్కు తరలివస్తున్నారు.

ప్రపంచంలోని 120 దేశాల నుంచి సుందరీలు
ఈ ఏడాది 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీల్లో 120 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటుండగా, ఈ పోటీలను ఆతిథ్యం ఇవ్వడం భారతదేశానికి రెండోసారి. పోటీలను హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా నిర్వహించనున్నారు. ఇప్పటికే పోటీదారుల రాక ప్రారంభమైంది. వారి కోసం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద ప్రత్యేక లాంజ్లు, సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయడం గమనార్హం. సమాచారం అందించేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలు, సంస్కృతి, ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
తెలంగాణ సాంస్కృతితో స్వాగతం
తెలంగాణలోని పర్యాటక ఆకర్షణలు,సాంస్కృతిక చిహ్నాలను చూపిస్తూ స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు.పండుగ వాతావరణాన్ని సృష్టిస్తున్న ఈ ఏర్పాట్లలో,”తెలంగాణ జరూర్ ఆనా“(తప్పక తెలంగాణ రండి)అనే నినాదం పర్యాటకులను ఆకర్షించేలా పలు చోట్ల ప్రదర్శిస్తున్నారు.మిస్ వరల్డ్ వేదికను ఉపయోగించుకుని రాష్ట్ర పర్యాటకాన్ని మరింతగా ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే మిస్ బ్రెజిల్ జెస్సికా స్కాండుజ్ పెద్రోసో, మిస్ సౌత్ ఆఫ్రికా జోయాలిజే జాన్సన్వాన్ రెన్స్బర్గ్ సహా దాదాపు 90 మంది పోటీదారులు హైదరాబాద్ చేరుకున్నారని నిర్వాహకులు వెల్లడించారు. విమానాశ్రయంలో పర్యాటక శాఖ అధికారులు వీరికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, అనంతరం వారిని బస ఏర్పాటు చేసిన హోటళ్లకు తరలించారు.
భారతదేశం తరపున నందిని గుప్తా
ఈ పోటీలో భారత్కు ప్రాతినిధ్యం వహించనున్నారు ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2023 నందిని గుప్తా, ఆమె ఈ పోటీలో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ప్రస్తుతం మిస్ వరల్డ్ కిరీటాన్ని ధరించి ఉన్న పోలాండ్ సుందరి కరోలినా బీలవ్స్కా, తన వారసురాలికి కిరీటం అలంకరించనున్నారు.
Read also: Telangana : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ భారతి – రైతులకు రక్షణ కవచం