Miss World 2025 పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల సుందరీమణులు బుధవారం తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక నగరం వరంగల్ను సందర్శించారు. ఈ పర్యటనలో వారు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ఆస్వాదించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయబడ్డాయి.హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వరంగల్కు చేరుకున్న ఈ అందాల బృందానికి హన్మకొండలోని హరిత కాకతీయ రిసార్టు వద్ద ఘనస్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, నగర పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్, స్థానిక మహిళలు సంప్రదాయ పద్ధతిలో వారిని ఆహ్వానించారు. వారు బతుకమ్మ ఆడుతూ, రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు.తదుపరి, యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రాంగణంలో భారతీయ సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోయిన సుందరీమణులు గ్రూప్ ఫోటోలు తీసుకున్నారు. టూరిజం గైడ్లు ఆలయ విశిష్టత, కాకతీయ శిల్పకళ గురించి వివరించారు.
రామప్ప ఆలయ నిర్మాణ శైలి, శిల్పాలలోని జీవకళ వారిని అబ్బురపరిచాయి.ఈ సందర్శనలో వరంగల్ నగరంలోని ఇతర చారిత్రక ప్రదేశాలను కూడా వారు సందర్శించారు. వెయ్యి స్థంభాల గుడిని దర్శించుకున్న సుందరీమణులకు వేదపండితులు ఆశీర్వచనం అందించారు.ఈ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మొత్తం 1,000 మందికి పైగా పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. ముగ్గురు డీసీపీలు, ఒక అదనపు డీసీపీ, 11 మంది ఏసీపీలు, 32 మంది ఇన్స్పెక్టర్లు, 81 మంది ఎస్సైలు, 115 మంది కానిస్టేబుళ్లతో పాటు 325 మంది మహిళా పోలీసులు, 106 మంది హోంగార్డులు, 210 మంది ప్రత్యేక పోలీసులు (డిస్ట్రిక్ట్ గార్డ్స్) భద్రతా పర్యవేక్షణలో నిమగ్నమయ్యారు. బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ బృందాలు కూడా భద్రతా పర్యవేక్షణలో పాల్గొన్నారు.ఈ పర్యటన తెలంగాణ రాష్ట్రం సంప్రదాయాలను, చారిత్రక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప అవకాశం. భారతీయ సంస్కృతిని ఆస్వాదించిన ఈ సుందరీమణుల అనుభవాలు, వారి అభిప్రాయాలు స్థానికులందరికీ స్ఫూర్తినిచ్చాయి.
Read Also : Neeraj Chopra : నీరజ్ చోప్రాకు టెరిటోరియల్ ఆర్మీ గౌరవం