ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన

Read Time:  1 min
ponguleti indiramma
ponguleti indiramma
FONT SIZE
GET APP

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులైన లబ్ధిదారులకు ఇది అందించాలనే ప్రభుత్వ విధానమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో చీఫ్ సెక్రటరీ శాంతికుమారితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, రెవెన్యూ వ్యవస్థ, సర్వేయర్ల నియామకంపై సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో ఇండ్లకు అర్హులైన లబ్ధిదారుల నివాస స్థల పరిస్థితుల ప్రకారం రెండు జాబితాలను గ్రామసభల్లో ఉంచాలని మంత్రి అధికారులకు సూచించారు. దశల వారీగా ఇండ్ల నిర్మాణం చేపట్టి, ప్రతి అర్హుడికి ఇండ్లు అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం హౌసింగ్ కార్పొరేషన్‌లో ఉన్న 274 ఇంజనీర్లు అన్ని పరిశీలిస్తున్నప్పటికీ, అదనంగా 400 మంది ఇంజనీర్లు అవసరమని అధికారులు తెలిపారు. ఇతర ప్రభుత్వ విభాగాల ఇంజనీరింగ్ సిబ్బందిని కూడా ఉపయోగించే అవకాశాలపై చర్చ జరిగిందని , ఇందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇండ్ల నిర్మాణానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని, ఇందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే, ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారిని నియమించేందుకు వీఆర్వో, వీఆర్‌ఏల నుంచి అర్హులైన వారిని ఎంపిక చేసి పరీక్ష నిర్వహించాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి విధివిధానాలను త్వరగా రూపొందించి, పారదర్శకతతో నియామక ప్రక్రియ చేపట్టాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం ఉన్న 450 మంది సర్వేయర్లకు అదనంగా 1000 మంది అవసరమని పేర్కొంటూ, ఈ నియామకాలు నిష్పక్షపాతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.