Telugu News: Minister Sridhar Babu: విదేశీ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ

Read Time:  1 min
Minister Sridhar Babu
Minister Sridhar Babu
FONT SIZE
GET APP

హైదరాబాద్: విదేశీ పెట్టుబడులకు తెలంగాణా అత్యంత అనుకూల గమ్యస్థానమని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Duddilla Sridhar Babu) వెల్లడించారు. ఐటీ, ఏరోస్పేస్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా రంగాలకు ఒక మంచి ఎకో సిస్టమ్‌ను రాష్ట్రంలో అభివృద్ధి చేసినట్టు తెలిపారు. గురువారం సచివాలయంలో తనను కలిసిన జర్మన్ ఫ్రీడరిక్ ఎబర్ట్ స్క్రిప్టంగ్ (ఎఫ్‌ఈఎస్) ఫౌండేషన్ ప్రతినిధులు డా. సబీన్ ఫాండ్రిక్, మిర్కో గుంథర్, క్రిస్టోవ్ మోహ్ తదితరులకు రాష్ట్రం అమలు చేస్తున్న సులభతర పారిశ్రామిక విధానాలను, సంక్షేమ పథకాలను వివరించారు.

Read Also: TG Rising Policy: రైజింగ్ తెలంగాణ – సమగ్ర అభివృద్ధి లక్ష్యం

తెలంగాణలో నైపుణ్యం, జర్మనీతో భాగస్వామ్యం

అత్యంత ప్రతిభావంతులైన యువత రాష్ట్రంలో ఉన్నందున నైపుణ్యాలకు కొదవలేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జర్మనీ-తెలంగాణా (Telangana) భాగస్వామ్యంలో వాణిజ్యం, పరిశ్రమల ఏర్పాటుకు తాము అన్ని విధాలా సహకరిస్తామని ఆయన చెప్పారు.

నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు: ఇండస్ట్రీ భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ని నెలకొల్పామని, పరిశ్రమలు తమకు అవసరమైన నైపుణ్యాల్లో యువతకు శిక్షణ ఇచ్చి నేరుగా నియమించుకునే అవకాశం ఇది కల్పిస్తుందని పేర్కొన్నారు. దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర స్కిల్స్ యూనివర్సిటీకి చైర్మన్‌గా ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) పరిశోధన, వినూత్న ఆవిష్కరణల కోసం ప్రత్యేక ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న నిపుణులకు రీ-స్కిల్, అప్-స్కిల్లింగ్ లో ప్రత్యేక శిక్షణ అందజేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పారిశ్రామిక శిక్షణ కేంద్రాలన్నిటినీ అడ్వాన్స్‌డ్ ట్రెయినింగ్ సెంటర్‌లుగా అభివృద్ధి చేస్తున్నామని, షాప్ ఫ్లోర్ నైపుణ్యం ఇక్కడే అందించి పరిశ్రమలకు మానవ వనరుల కొరత లేకుండా చూస్తున్నామన్నారు.

Minister Sridhar Babu
Minister Sridhar Babu Telangana as a destination for foreign investments

వివిధ రంగాలలో పెట్టుబడులు, అభివృద్ధి

లైఫ్ సైన్సెస్: లైఫ్ సైన్సెస్ రంగంలో నూతన ఆవిష్కరణలు, ఇంక్యుబేషన్ కోసం జీనోమ్ వ్యాలీలో ఇటీవలె బయోనిక్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. మొడికల్ ఫార్ములేషన్స్, వ్యాక్సిన్ పరిశోధనలకు ఇది వేదికగా ఉపకరిస్తుందని చెప్పారు.

ఫార్మా, ఏరోస్పేస్, రక్షణ: ఫార్మా ఉత్పత్తుల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉండగా, కొత్తగా ఏరోస్పేస్, రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు దానిని అధిగమించాయని తెలిపారు. రూ.1300 కోట్లతో ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్ విమాన ఇంజిన్ల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాలింగ్ కేంద్రాన్ని నెలకొల్పిందని, రఫేల్ యుద్ధ విమానాల మరమ్మతులు, ఓవర్ హాలింగ్ ఇక్కడే జరుగుతాయని వివరించారు.

ఎంఎస్‌ఎంఈలు (MSMEs): కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సూచన మేరకు ఎంఎస్‌ఎంఈల కోసం నూతన విధానాన్ని రూపొందించామని, ఈ రంగంలో ఆటోమేషన్ కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఎంఎస్‌ఎంఈల ద్వారానే లభిస్తాయని, రాష్ట్రం ఈ రంగానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చి సహకరిస్తోందని చెప్పారు.

గిగ్ వర్కర్స్: రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు నాలుగు లక్షల మంది గిగ్ వర్కర్ల భద్రత, సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి దృష్టి: పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనలో తాము మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడటం లేదని, తమ పోటీ దేశాలతోనే అని సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడి అద్భుతమైన ఎకో సిస్టం, చక్కని వాతావరణం వల్ల పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని తెలిపారు.

విద్యుత్ ఉత్పత్తి: డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల విద్యుత్తు అవసరాలు పెరుగుతాయని, సోలార్, పంప్డ్ స్టోరేజి విద్యుదుత్పాదన ద్వారా భవిష్యత్తులో కరెంటు కొరత రాకుండా 10 వేల మెగావాట్లు ఉత్పత్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని వివరించారు.

అమెరికన్ కంపెనీలు: అమెరికాలోని ప్రతి ప్రముఖ కంపెనీకి ఇక్కడ కార్యాలయాలున్నాయని, చవకైన మానవ వనరులు, నైపుణ్యాల లభ్యత వల్ల ఈ రంగంలోకి విస్తృతంగా పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు.

సంక్షేమ కార్యక్రమాలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు

రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను శ్రీధర్ బాబు జర్మన్ ప్రతినిధి బృందానికి వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల వారి సాధికారతకు మార్గం సుగమం అయిందని తెలిపారు. 65 లక్షల మంది స్వయం సహాయక బృందాల మహిళలకు పావలా వడ్డీ రాయితీ సదుపాయం కల్పించామని, దీనితో బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి 22 వేల కోట్ల రుణం తీసుకునే అవకాశం వారికి ఏర్పడిందని, వాటితో మహిళలు ఎంట్రప్రెన్యూర్‌లుగా, వ్యాపారాల్లో ఎదుగుతున్నారని వివరించారు. యునైటెడ్ నేషన్స్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్స్ గోల్స్ (UNSDGs) ను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నామని శ్రీధర్ బాబు వెల్లడించారు. సమావేశంలో ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.