హైదరాబాద్ (Hyderabad) నగర అభివృద్ధిలో కీలకంగా భావిస్తున్న మెట్రో (Metro) రైలు రెండో దశ ప్రాజెక్టుకు తాత్కాలిక ఆటంకం ఎదురైంది. చార్మినార్, ఫలక్నుమా వంటి వారసత్వ కట్టడాల సమీపంలో పనులు చేపట్టవద్దని హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు
వారసత్వ కట్టడాల పరిరక్షణపై అధ్యయనం లేకుండా, వాటి సమీపంలో మెట్రో కారిడార్-6 పనులు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ (ఏపీడబ్ల్యూఎఫ్) హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.

ప్రభుత్వానికి గడువు మంజూరు
ఈ కేసును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్పాల్, జస్టిస్ యారా రేణుకలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, మెట్రో పనుల కారణంగా చార్మినార్, ఫలక్నుమాతో పాటు పలు నిర్మాణాలకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. తెలంగాణ వారసత్వ కట్టడాల రక్షణ చట్టం, కేంద్ర పురావస్తు శాఖ చట్టం నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకున్నాకే పనులు చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేయడానికి మూడు వారాల గడువు కావాలని అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాజ్ఖాన్ కోరగా ధర్మాసనం అనుమతిస్తూ విచారణను వాయిదా వేసింది.
రూ. 19 వేల కోట్ల మెట్రో రెండో దశ ప్రాజెక్టు
హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టును దాదాపు రూ. 19 వేల కోట్ల అంచనాతో ప్రతిపాదించారు. 3 మార్గాల్లో 86.5 కి.మీ. ప్రతిపాదించారు. జేబీఎస్-శామీర్పేట; జేబీఎస్-మేడ్చల్; శంషాబాద్ విమానాశ్రయం-ఫ్యూచర్సిటీ మార్గాలను ఇందులో చేర్చారు.
హెచ్ఏఎంఎల్ నుంచి ప్రాజెక్ట్ నివేదిక సమర్పణ
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)ను హెచ్ఏఎంఎల్ (Hyderabad Airport Metro Limited) బోర్డు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) బోర్డు ఇటీవల ఆమోదం తెలపడంతో నివేదిక తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
Read also: Mal Reddy: విద్యతోనే ఉజ్వల భవిష్యత్ : ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి