కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)పై ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ నివేదికపై జరిగిన సమావేశం ముగిసింది. ఈ నివేదికలో ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై కీలక విషయాలు వెల్లడైనట్లు సమాచారం. ముఖ్యంగా, ప్రాజెక్టు వైఫల్యాలకు బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలకు ఈ కమిషన్ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. నివేదికలో కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ల పాత్రలపై కూడా ప్రస్తావన ఉందని, కేసీఆర్, హరీష్ రావు ఆదేశాలతోనే కాళేశ్వరం నిర్మాణాలు చేపట్టినట్లు కమిషన్ నిర్ధారించినట్లు సమాచారం.
ఆర్థిక లోపాలు, అధికారుల పాత్ర
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక శాఖతో పాటు పలువురు అధికారుల లోపాలపై కూడా కమిషన్ (Commission ) ప్రత్యేకంగా దృష్టి సారించింది. అంచనాల పెంపు, నిధుల వినియోగంలో జరిగిన అక్రమాలను కమిషన్ నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడంలో అధికారుల పాత్రపై నివేదికలో స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
కేబినెట్ భేటీ, అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
కాళేశ్వరం కమిషన్ నివేదికపై రేపు జరగనున్న కేబినెట్ భేటీలో విస్తృతంగా చర్చించనున్నారు. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత, ఈ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టనుంది. దీనితో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలు, వాటికి బాధ్యులైన వారి వివరాలు ప్రజలకు తెలిసే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసే అవకాశం ఉంది.
Read Also : Bill Gates : ఏఐతో ఉద్యోగాలకు ముప్పు : బిల్ గేట్స్ కీలక విశ్లేషణ