తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆగస్టు నెల మొదటి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రరూపం దాల్చటంతో వర్షాల ప్రభావం మరింతగా పెరిగింది. దీంతో అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతుండటంతో గ్రామాలు, పట్టణాలు జలమయం అవుతున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) లో కూడా వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. నగరంలోని అనేక కాలనీలు నీటమునిగిపోయాయి. పలు ప్రధాన రహదారులపై వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం కలిగింది. మియాపూర్, కూకట్పల్లి, అమీర్పేట్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్ వంటి బిజీ ప్రాంతాల్లో వర్షం కారణంగా రవాణా అంతరాయానికి గురైంది. హైదరాబాదులో పాతబస్తీ ప్రాంతంలో కూడా వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం
వాతావరణ శాఖ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా హెచ్చరికలు జారీ చేసింది. ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ అక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ జిల్లాలు హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్. ఈ జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మిగిలిన 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow alert) ప్రకటిస్తూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.వర్షాల కారణంగా పలు జిల్లాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లడంతో వంతెనలపై నీరు నిలిచిపోయింది. రహదారులు తెగిపోవడంతో గ్రామాలు, పట్టణాల మధ్య రవాణా నిలిచిపోయింది. రైతులు కూడా భారీ వర్షాల వల్ల నష్టపోతున్నారు. ఇప్పటికే వర్షాల కారణంగా పంటలు నీటమునిగిపోయాయి. ముఖ్యంగా వరి, మక్కజొన్న, పత్తి పంటలకు నష్టం కలుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.భారీ వర్షాల ప్రభావం కామారెడ్డి జిల్లాలో తీవ్రంగా ఉంది. గత 14 గంటల్లోనే ఈ జిల్లాలో దాదాపు 500 మిల్లిమీటర్ల (50 సెంటీమీటర్లు) వర్షపాతం నమోదైందని వాతావరణ అధికారులు వెల్లడించారు.
ప్రధాన రహదారులు వరద ప్రవాహంలో చిక్కుకోవడం
సాధారణంగా 100-200 మిల్లీమీటర్ల వర్షానికే వరదలు వచ్చే పరిస్థితులు నెలకొంటాయని.. అలాంటిది కేవలం గంటల వ్యవధిలోనే ఇంత భారీ వర్షం కురవడంతో అనేక గ్రామాలు నీట మునిగాయి. హైవేలు, ప్రధాన రహదారులు వరద ప్రవాహంలో చిక్కుకోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.కామారెడ్డి జిల్లాలోని రాజంపేటలో బుధవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు 136 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాత వర్షం తీవ్రత మరింత పెరిగి, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏకంగా 363 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితి చూసి గతంలో ఎన్నడూ ఇంతటి వర్షం చూడలేదని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో వర్షాలు ఇంకా కొనసాగుతాయని.. మొత్తం వర్షపాతం 550-600 మిల్లీమీటర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం జోరుగా వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచే వర్షం మెుదలైంది.
Read hindi news: https://hindi.vaartha.com/
Read Also :