తెలంగాణలో వరుణుడి ఆగ్రహం కొనసాగుతోంది. గత రెండు వారాలుగా దాదాపు ప్రతీ రోజూ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు వరద ముప్పుతో వణికిపోతున్నాయి. ఆదిలాబాద్, కుమ్రం భీం-అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కుండపోత వర్షాలు కురవడంతో నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చిన్నా, పెద్ద చెరువులు పొంగిపొర్లుతూ పరిసర గ్రామాలను ముంచెత్తుతున్నాయి. రహదారులు తడిసి ముద్దవడంతో పలు ప్రాంతాల్లో రవాణా అంతరాయం (Transportation disruption) ఏర్పడింది.ఇక వ్యవసాయ క్షేత్రాల విషయానికి వస్తే, పంట పొలాల్లో నీరు నిల్వ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పత్తి, వరి పంటలు నీట మునిగిపోవడంతో నష్టాలు తప్పవని రైతులు చెబుతున్నారు.
ఈ మేరకు పలు జిల్లాలకు అలెర్ట్ జారీ
మరోవైపు వర్షాల కారణంగా కొండప్రాంతాల గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేశారు.రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ మేరకు పలు జిల్లాలకు అలెర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలుల వర్షాలు (Thunderstorms) పడే అవకాశం ఉందని హెచ్చరించింది. నేడు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

పలు చోట్ల వాహనాదారులు ఇబ్బందులు
శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపారు.గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామపట్నం గ్రామంలో 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, కొత్తగూడెం, మహబూబ్నగర్, వనపర్తి, సిద్దిపేట, మెదక్, ములుగు, నాగర్కర్నూల్, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో కూడా వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలో రాత్రి 8 గంటల సమయంలో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవటంతో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో పలు చోట్ల వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేడు కూడా వర్షం హెచ్చరికలు జారీ చేయటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: