తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అప్పుల భారంతో కూడిన సవాళ్లు, అలాగే రాబోయే ప్రతిష్టాత్మక విద్యా పథకాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ఈ భేటీకి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, గత ప్రభుత్వం అవలంబించిన అప్పు విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
వడ్డీ చెల్లింపులకే ఖర్చవుతున్నాయని ఆవేదన
విచక్షణారహితంగా తీసుకున్న భారీ అప్పులు, అధిక వడ్డీ రేట్లతో కూడిన రుణాలు ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రత్యేకించి విద్య, ఆరోగ్య రంగాలకు కేటాయించాల్సిన నిధులు వడ్డీ చెల్లింపులకే (Interest payments) ఖర్చవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ అధిక వడ్డీల భారం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ప్రస్తుతం ఉన్న అప్పులను రీస్ట్రక్చరింగ్ (పునర్వ్యవస్థీకరణ) చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించి, రాష్ట్రానికి సహకరించాలని కోరారు.
కీలక నిర్ణయం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న విద్యా పథకాలకు కేంద్ర సహకారం కోరుతూ ఆయన రెండు కీలక ప్రతిపాదనలను కేంద్ర మంత్రి ముందుంచారు. అదేవిధంగా, రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని సీఎం తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 105 నియోజకవర్గాల్లో ‘యంగ్ ఇండియా మోడల్ స్కూళ్ల’ను నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కేంద్రం అందించాలని నిర్మలా సీతారామన్ను ఆయన అభ్యర్థించారు. ఈ రెండు అంశాలపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు సమావేశం అనంతరం సీఎం పేర్కొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: