ప్రస్తుతం దేశం ఓ సంక్లిష్ట పరిస్థితిలో ఉంది. ఓవైపు పాకిస్థాన్తో భూభాగ భద్రతకు సంబంధించి భారత సైన్యం సరిహద్దుల్లో కాపలాగా నిలుస్తోంది. దేశానికి సేవ చేసే జవాన్లు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధుల్లో పాల్గొంటున్నారు. ఈ తరుణంలో దేశ సైన్యానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “దేశం కోసం సేవ చేస్తోన్న సైనికులకు మద్దతుగా ప్రతి ఒక్కరూ నిలవాలి. ఇది మన కర్తవ్యం, ఇది దేశభక్తి” అని పేర్కొన్నారు.
రాయల శేషగిరిరావు సేవలకు ఘన నివాళి
కేటీఆర్ తన ప్రసంగానికి ముందు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్, స్వర్గీయ రాయల శేషగిరిరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన జీవితం రైతుల సంక్షేమం కోసం జరిగిన పోరాటంగా పేర్కొంటూ, “అలాంటి నాయకులను గుర్తుంచుకుంటేనే తరం తరం వారికి స్ఫూర్తి లభిస్తుంది” అన్నారు. వారి సేవలను ప్రజలకు గుర్తుచేసే విధంగా బీఆర్ఎస్ ఈ విగ్రహాన్ని ప్రతిష్టించిందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు, కానీ జిల్లాకు ఒనగూరిన ప్రయోజనం ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అఫిడవిట్లు, బాండ్లు రాసి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. కేసీఆర్ హయాంలో అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన మండిపడ్డారు. రైతు రుణమాఫీ, ఆడబిడ్డలకు తులం బంగారం వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించిన కేటీఆర్, ఖమ్మం జిల్లా ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్కు ఓటేశారు, ఇప్పుడు ఆ మార్పు ఎక్కడ కనబడుతోంది? అని వ్యాఖ్యానించారు. మా పరిపాలనపై కొద్దిగా బోర్ కొట్టి, వారికి ఓట్లు వేశారు. ఇప్పుడు ఏమైంది? అని ప్రజలనుద్దేశించి అన్నారు.
రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు
రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు చేసిన కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని, వారిని నిలదీసి తీరుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. “రేవంత్ రెడ్డి అంత నికృష్ట ముఖ్యమంత్రిని చూడలేదు. ఢిల్లీలో ఆయనకు అపాయింట్మెంట్లు దొరకడం లేదని, అక్కడ ఆయన్ను చెప్పులు ఎత్తుకుపోయేవాడిగా, దొంగలా చూస్తున్నారని అంటున్నారు. దొంగను దొంగలా కాకుండా మరెలా చూస్తారు?” అంటూ ఎద్దేవా చేశారు. అంబేద్కర్ కూడా ఇటువంటి దుర్మార్గులు అధికారంలోకి వస్తారని ఊహించి ఉండరని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి అవకాశం వస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. ఈ ఎన్నికల కోసం బీఆర్ఎస్ శ్రేణులు సీరియస్గా పనిచేయాలని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలన్నింటినీ గెలుచుకుని గులాబీ జెండా ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. పాలనలో తాము అందించిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ఇప్పటికీ బీఆర్ఎస్ను గుర్తిస్తున్నారని, కాంగ్రెస్పై వ్యతిరేకత పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
Read also: TGSRTC: ఏ గుర్తింపు కార్డు ఉన్న ఉచిత బస్సు ప్రయాణం: సజ్జనార్