KTR : వచ్చే ఏడాది నుండి పాదయాత్ర చేస్తా : కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి తాను పాదయాత్రకు సిద్ధమయ్యానని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి ప్రజలతో నేరుగా మమేకమవ్వాలని, ప్రజా సమస్యలను తెలుసుకోవాలని ఈ యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాల పర్యటనలను ప్రారంభించినట్లు కేటీఆర్ వెల్లడించారు. డిసెంబర్ వరకు పూర్తిగా పార్టీ బలోపేతం కార్యక్రమాలకే అంకితమై ఉంటానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు అద్భుత స్పందన ఇస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలు ప్రజలకు ఏమాత్రం మేలు చేయడం లేదని కేటీఆర్ విమర్శించారు.అరాచక పాలన నుంచి తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీదేనని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో బీఆర్ఎస్ అగ్రభాగాన ఉందని కేటీఆర్ గుర్తు చేశారు. అధికారాన్ని నిర్వహించిన అనుభవమూ ఉందని, ప్రతిపక్షంలో నిలబడే ధైర్యమూ ఉందని అన్నారు.
కాంగ్రెస్ పాలనను మరోసారి నిలువరించేందుకు బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని స్పష్టం చేశారు. ప్రస్తుతం కొన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ బీఆర్ఎస్ మరోసారి ప్రజల మద్దతుతో పైకి లేస్తుందని కేటీఆర్ తెలిపారు. ఫినిక్స్ పక్షిలా మరింత బలంగా ముందుకు సాగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.