తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. “సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్నా నాకేటి సిగ్గు” అన్న సామెతను ఉదహరించుతూ, “అలావుంది రేవంత్ రెడ్డి వ్యవహారం” అంటూ ఘాటు కామెంట్స్ చేశారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగినప్పుడు, “ఒక బాధ్యతగల ముఖ్యమంత్రివి అయితే రెస్క్యూ ఆపరేషన్ మీద దృష్టి పెడతావు”, కానీ “నీకు పాలన అంటే ఏమిటో కూడా తెలియదు” అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇన్స్టాగ్రామ్ రీల్స్ కాదు.. ఆ వీడియో చూడు
కేటీఆర్ ప్రకారం, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం డిజైన్ ఫెయిల్యూర్ అని కేసీఆర్ చాలా కాలం క్రితమే స్పష్టం చేశారని పేర్కొన్నారు. “ఇన్స్టాగ్రామ్ రీల్స్ కాదు.. ఆ వీడియో చూడు.. కొంచెమైనా విషయ పరిజ్ఞానం వస్తుంది” అని ఎద్దేవా చేశారు. అదేవిధంగా, “పనులు ఆగిపోవడంతో బేరింగులు పనిచేయడం లేదని చెప్పడం ఏంటి?” అని ప్రశ్నించారు. “అసలు పనులు మొదలు పెట్టేముందు టెక్నికల్ అసెస్మెంట్, జీఎస్ఐ సర్వే చేసినట్లయితే ఈ ప్రమాదం జరిగేదా?” అని రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
తెలంగాణలో ఎస్ఎల్బీసీ ఘటన రాజకీయ దుమారం
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తే, సీఎం రేవంత్ రెడ్డి దానిపై మాట్లాడకుండా, నిరర్థకమైన లీకులు, అనవసరమైన చిట్ చాట్లు సాగిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. “ప్రమాదానికి పాలకులు బాధ్యత వహించాలి” అనే విధంగా కాకుండా, “పట్టించుకోవాల్సిన విషయాలను పక్కన పెట్టి నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదని” హితవు పలికారు. తెలంగాణలో ఎస్ఎల్బీసీ ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. మున్ముందు ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.