ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Read Time:  1 min
KTR attended the ED investigation.. Tension at the ED office
KTR attended the ED investigation.. Tension at the ED office
FONT SIZE
GET APP

హైదరాబాద్‌: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఉదయం ఈడీ విచారణకు హాజరయ్యారు. గచ్చిబౌలిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరి నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు చేపట్టారు. దాదాపు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు. అటు, ఈడీ కార్యాలయం వద్ద అధిక సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగి తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

కాగా, ఈ నెల 7న విచారణకు కేటీఆర్‌ హాజరవాల్సి ఉన్నది. అయితే ఏసీబీ కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసిన నేపథ్యంలో.. తీర్పు వచ్చేవరకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో 16న విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరయ్యారు.

image
image

అంతకుముందు.. ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ను తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచపటంలో హైదరాబాద్‌ నగరాన్ని నిలపడం మంత్రిగా తాను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ‘ఫార్ములా రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ-మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్‌ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఎన్ని రకాల చిల్లర కేసులు, బురదజల్లే కార్యక్రమాలు, రాజకీయ వేధింపులకు పాల్పడినా ఈ రేసు ద్వారా సాధించిన విజయాలను తగ్గించలేవు. మంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్‌ హైదరాబాద్‌ను పెంపొందించడమే ఎల్లవేళలా ముఖ్యమైన అంశంగా నేను భావిస్తాను. ఫార్ములా-ఈ రేసు హైదరాబాద్‌ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పటంలో నిలిపింది.

రాష్ట్ర ప్రభుత్వం పంపిన రూ.46 కోట్లు ఫార్ములా-ఈ సంస్థకు అత్యంత పారదర్శకంగా బదిలీ చేయడం జరిగింది. కేవలం బ్యాంకు లావాదేవీగా స్పష్టమైన రికార్డు ఉంది. ఒక్క రూపాయి కూడా వృధా కాలేదు. ప్రతి నయా పైసాకూ లెక్క ఉంది. మరి అలాంటప్పుడు ఇందులో అవినీతి, మనీలాండరింగ్‌ ఎక్కడ ఉంది?. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీసుకున్న అసంబద్ధమైన రేసు రద్దు నిర్ణయం వల్లే రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లింది. ఎలాంటి తప్పు లేకున్నా కేవలం రాజకీయ వేధింపుల కోసమే కాంగ్రెస్‌ ప్రభుత్వం కోర్టు కేసుల విచారణ పేరుతో ఈ అంశాన్ని లాగుతున్నది. కచ్చితంగా ఈ అంశంలో నిజమే గెలుస్తుంది. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రజలు, కోర్టులు కూడా త్వరలో తెలుసుకుంటాయి. అప్పటిదాకా న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.’ అని కేటీఆర్‌ అన్నారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.