తెలంగాణ రాష్ట్రంలో సాగు నీటి ప్రాధాన్యతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి, కృష్ణా నదుల జలాల పరిరక్షణ కోసం గత పదేళ్లలో కేసీఆర్ (KCR) తీసుకున్న నిర్ణయాలు రైతాంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే తెలంగాణ ఉద్యమం లక్ష్యాలను సాధించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిందలు, దందాలు, చందాలతో ప్రజలను మభ్యపెడుతుందని ఆరోపించారు.
కాంగ్రెస్ విమర్శలకు కేటీఆర్ కౌంటర్
మేడిగడ్డ బ్యారేజీలో పలు అంశాలపై జరుగుతున్న విమర్శలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లలో ఒకదానిపై పగుళ్లు వచ్చినంత మాత్రాన ప్రాజెక్టును పనికిరాదని ప్రకటించడం తగదని అన్నారు. ఎన్డీఎస్ఏ నివేదికను అడ్డగోలుగా వాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఈ నివేదికను ఎల్అండ్టీ సంస్థ తిరస్కరించిందని, మేడిగడ్డను అదే సంస్థ కట్టిందని తెలిపారు. అదే సంస్థతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎందుకు కట్టించిందని రేవంత్రెడ్డిని ప్రశ్నించారు.
తెలంగాణ రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
తెలంగాణ రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర బీజేపీ మౌనాన్ని విమర్శించిన కేటీఆర్, జలాల అంశంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాల ద్వారా కేసీఆర్ ప్రభుత్వం సాగునీటిని రైతులకు అందించేందుకు విశేషంగా కృషి చేసిందని తెలిపారు. మళ్లీ కేసీఆర్ నాయకత్వం అందితేనే రైతులకు భరోసా ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లాల్లో ఈ అంశంపై సమావేశాలు కొనసాగిస్తామని, ప్రజలముందు వాస్తవాలను ఉంచేందుకు ఎమ్మెల్యే హరీశ్ రావు ఆధ్వర్యంలో ప్రజెంటేషన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
Read Also : TDP : మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం కన్నుమూత