తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై విచారణ (Kaleshwaram Commission) కొనసాగుతున్న నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) గురువారం కమిషన్ ఎదుట హాజరయ్యారు. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ సుమారు 50 నిమిషాలపాటు కేసీఆర్ను ప్రశ్నించింది. ప్రాజెక్టు ఆరంభం నుండి అభివృద్ధి దాకా తీసుకున్న నిర్ణయాలు, మార్పులు, మంత్రివర్గ ఆమోదాలు వంటి అంశాలపై అధికారికంగా వివరణ కోరింది. కేసీఆర్ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రాజెక్ట్ మార్పులపై కీలక ప్రశ్నలు
కమిషన్ విచారణలో అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్థలాలను మార్పు చేయడంపై ప్రత్యేకంగా ప్రశ్నలు వినిపించాయి. ఈ స్థలాల ఎంపికలో ఉన్న పారదర్శకత, మౌలిక కారణాలు మరియు ఆర్థిక ప్రభావాలపై కమిషన్ స్పష్టత కోరింది. ప్రాజెక్టుకు మంత్రివర్గ ఆమోదం ఉందా? వంటి కీలక అంశాలపై కూడా విచారణ సాగింది. కేసీఆర్ అందించిన వివరాలపై కమిషన్ సభ్యులు నిశితంగా గమనించినట్లు సమాచారం. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తీసుకున్న విధానాలపై ఆయన పూర్తి వివరాలతో సమాధానమిచ్చినట్టు చెబుతున్నారు.
ప్రెజెంటేషన్ నివేదికను అందించిన కేసీఆర్
స్వల్ప అనారోగ్యంతో ఉన్న కేసీఆర్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కమిషన్, పరిమిత సంఖ్యలో అధికారులతో విచారణ నిర్వహించింది. ఈ విచారణలో జస్టిస్ పీసీ ఘోష్తో పాటు కమిషన్ కార్యదర్శి మురళీధర్, నోడల్ అధికారులు శ్రీనివాస్, విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధిత అంశాలపై పూర్తి వివరాలుగా రూపొందించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను కేసీఆర్ కమిషన్కు సమర్పించారు. ఇప్పుడు ఈ నివేదిక ఆధారంగా కమిషన్ తన తుది నివేదిక సిద్ధం చేయనుంది.
Read Also ; Trump vs Musk : ట్రంప్ వ్యాఖ్యలకు చింతిస్తున్నా – మస్క్