బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఆరోగ్య పరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరినప్పటికీ, రాష్ట్ర రాజకీయాలు, ప్రజల సమస్యలపై తన దృష్టిని మళ్లించలేదు. శుక్రవారం ఆసుపత్రిలోనే ఆయనను పరామర్శించేందుకు వచ్చిన పార్టీ ముఖ్య నేతలతో సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను ఎక్కడ ఉన్నా పార్టీని, ప్రజల సంక్షేమాన్ని మర్చిపోనని ఈ సందర్భంగా మరోసారి నిరూపించారు.
రైతుల సమస్యలపై కేసీఆర్ ఆరా
ఈ సమావేశానికి కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. వారితో చర్చల సందర్భంగా కేసీఆర్ ముఖ్యంగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. యూరియా కొరత, సాగునీటి ప్రాజెక్టులపై వదిలిన పట్టా ప్రభుత్వ వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. బనకచర్ల ప్రాజెక్టు విషయమై ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని ఎదుర్కొనే మార్గాలు కూడా చర్చలో భాగమయ్యాయి.
క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ తీసుకున్న బీఆర్ఎస్ అధినేత
పార్టీ నాయకులు వివరించిన క్షేత్రస్థాయి పరిస్థితులను కేసీఆర్ శ్రద్ధగా విన్నారు. ప్రతి అంశంపై వివరాలు తెలుసుకుని, వారివద్ద నుంచి ఫీడ్బ్యాక్ కూడా స్వీకరించారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై రాజకీయ ప్రతిస్పందన అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయంగా కొంత కాలంగా బహిరంగంగా కనిపించని కేసీఆర్, ఆసుపత్రిలో ఉన్నా పార్టీ కార్యక్రమాలకు మరింత బలాన్నిస్తోన్న సంకేతాలుగా ఈ పరిణామాలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
Read Also : Lokesh : రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం – నారా లోకేష్