తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు కలిసి ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందంగా జపాన్ పర్యటనలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా వారు కితాక్యూషూ నగరాన్ని సందర్శించారు. అక్కడి మేయర్ కజుహిసా టకేచీ నేతృత్వంలో జపనీస్ సంప్రదాయ పద్ధతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఘనంగా ఆహ్వానించారు.
కితాక్యూషూ మేయర్తో సీఎం రేవంత్ భేటీ
కితాక్యూషూ మేయర్తో జరిగిన సమావేశంలో అభివృద్ధి, పరిశ్రమలు, పర్యావరణ సాంకేతికతలపై చర్చలు జరిగాయి. ముఖ్యంగా నగరాభివృద్ధి, మునిసిపల్ పాలనలో జపాన్ అనుసరిస్తున్న శైలులు, శుభ్రతా ప్రమాణాలపై తెలంగాణ ప్రతినిధులు ఆసక్తిగా చర్చించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి జపాన్ సంస్థలు సహకరించాలని మేయర్ను కోరారు. మ్యూచువల్ సహకారంతో రెండు ప్రాంతాల మధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశాలపై చర్చించారని సమాచారం.
అంతర్జాతీయ పెట్టుబడుల రాకకు అవకాశం
ఈ పర్యటనతో తెలంగాణకు సంబంధించి అంతర్జాతీయ పెట్టుబడుల రాకకు అవకాశం ఏర్పడనుందని, తెలంగాణ రైజింగ్ నినాదం క్రింద రాష్ట్రానికి సాంకేతిక, పారిశ్రామిక, మునిసిపల్ అభివృద్ధిలో మంచి మార్గదర్శకత లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. జపాన్ టూర్ లో భాగంగా ప్రతినిధి బృందం ఇతర ప్రముఖ నగరాలు, పరిశ్రమల ను కూడా సందర్శించి, అనుభవాలను తెలంగాణ అభివృద్ధికి వినియోగించనుంది.