తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చేపల పులుసు హాట్ టాపిక్ అయింది. సాధారణంగా మాంసాహార ప్రియులు దీన్ని ఇష్టంగా ఆస్వాదిస్తారు. కానీ, రాజకీయ నాయకులు ఈ వంటకాన్ని విమర్శలకు ఆయుధంగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధంలో చేపల పులుసు కీలకంగా మారింది.
జల వివాదం 2.0
2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ – ఏపీ మధ్య నీటి పంపిణీ చర్చలు రాజకీయంగా మారాయి. కృష్ణా జలాల పంపిణీ, ప్రాజెక్టుల నిర్వహణ వంటి అంశాల్లో రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావడం లేదు. విభజన సమయంలో ఎపెక్స్ కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదన వచ్చినా, ఇప్పటికీ నీటి వివాదం సద్దుమణగలేదు.సీఎం రేవంత్ రెడ్డి – హరీష్ రావ్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. “గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగ్గా పాలన నిర్వహించి ఉంటే, ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు” అని రేవంత్ వ్యాఖ్యానించారు. దీనికి హరీష్ రావు స్పందిస్తూ, “ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు” అంటూ ప్రతిస్పందించారు.
పోతిరెడ్డి పాడు వివాదం
పోతిరెడ్డి పాడు హెడ్రెగ్యూలేటర్ విషయంలో కూడా విమర్శలు పెరిగాయి. గతంలో కేసీఆర్, జగన్ కలిసి నాటకాలు ఆడారని రేవంత్ ఆరోపించారు. అంతే కాకుండా, నగరి ఎమ్మెల్యే రోజా ఇంట్లో కేసీఆర్ చేపల పులుసు, రాగి సంకటి తిని “రాయలసీమను రతనాల సీమగా మారుస్తా” అని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
మాటల యుద్ధం
హరీష్ రావు మరో దిశగా మళ్లించారు. “ఏపీ కృష్ణా నీళ్లను తరలించుకుంటుంటే, రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో చంద్రబాబును పిలిచి మరీ మడుగులు ఒత్తాడు” అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. అలాగే, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబు ఇంటికి వెళ్లి చేపల పులుసు తిన్నారు కదా అని హరీష్ రావు నిలదీశారు.
ఎపెక్స్ కమిటీ
ప్రాజెక్టుల వారీగా రెండు రాష్ట్రాలకూ నీటి కేటాయింపులు జరగాలని,రెండు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఛైర్మన్గా,ఓ ఎపెక్స్ కమిటీని వేయాలని ప్రతిపాదించింది విభజన చట్టం. ఆ సంగతి కాస్త పక్కనపెడితే,ఇప్పటికీ నీళ్ల వాటాల విషయంలో నేతల మాటలతో జలవివాదం జటిలమవుతూనే ఉంది.