Indiramma illu scheme : ఇల్లు లేని నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద స్థలం ఉన్నా లేకున్నా ప్రతి అర్హుడికి సొంతిల్లు కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. స్థలం ఉన్న లబ్ధిదారులకు నేరుగా ఇల్లు మంజూరు చేస్తామని, స్థలం లేనివారికి జీ ప్లస్–2 తరహా నివాస సముదాయాలను నిర్మించి అందజేస్తామని తెలిపారు.
ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో నాలుగున్నర లక్షల ఇళ్లను నిర్మించినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. త్వరలో పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు. రాష్ట్రంలో ఒక్క నిరుపేద కూడా ఇల్లు లేకుండా ఉండకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తై లబ్ధిదారులు గృహప్రవేశాలు కూడా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తోందన్నారు.
Read Also: Shivraj Singh: తెలుగు రాష్ట్రాల రైతులపై అప్పుల భారం ఎక్కువ
ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో భాగంగా ఏప్రిల్ నుంచి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేయనున్నట్లు తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి మంజూరైన ఇళ్లలో ఇప్పటికే 53 శాతం వరకు పనులు పూర్తయ్యాయని, మిగిలిన 47 శాతం వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,69,014 ఇళ్లను కేటాయించగా, వీటిలో దాదాపు రెండున్నర లక్షల ఇళ్లకు గ్రౌండింగ్ పూర్తయిందన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటివరకు రూ.4,000 కోట్లకు పైగా నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నిధులను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు అందజేస్తున్నామని చెప్పారు. అయితే ఇసుక కొరత, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం వల్ల కొంతమంది లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు, స్థలం లేనివారికి జీ ప్లస్–2 ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: